ఆకలి లేని లోకం ఆయన స్వప్నం. ఆహార భద్రతే ఆ యోధుడి పోరాటం. దిగుబడిని పెంచి రైతుకు వ్యవసాయంపై భరోసా ఇవ్వాలి.. ఆ లక్ష్యంతో స్వామినాథన్ చేసిన కృషి అనిర్వచనీయం. నాణ్యమైన, బలమైన ఆహారాన్ని ప్రజలకు అందించడమే ఆయన ఉద్దేశం. హరిత విప్లవంతో ఎన్నో అద్భుతాలు సృష్టించిన హంగర్ ఫైటర్ స్వామినాథన్(MS Swaminathan) ఇక లేరు. శాస్త్రీయ విధానంతో వినూత్న వంగడాలను క్రియేట్ చేసి.. ఆకలి లేని సమాజాన్ని స్ధాపించాలన్న స్వామినాథన్ ఆశయం అద్వితీయం. తిండి కొరతలేకుండా చేయాలన్న సంకల్పంతో జీవించిన స్వామినాథన్ ఆఖరి శ్వాస విడిచారు.
20వ శతాబ్ధంలో ఆసియాలో ప్రభావం చూపిన 20 మంది వ్యక్తుల్లో ఎంఎస్ స్వామినాథన్ ఒకరని టైమ్ మ్యాగ్జిన్ కీర్తించింది. మహాత్మా గాంధీ, రవీంద్రనాథ్ ఠాకూర్ తర్వాత ప్రభావంతమైన భారతీయ వ్యక్తుల్లో ఆయన ఒకరు అని టైమ్ మ్యాగ్జిన్ పేర్కొన్నది. స్వామినాథన్ను ఫాదర్ ఆఫ్ ఎకనామిక్ ఎకాలజీ అని ఐక్యరాజ్యసమితి కీర్తించింది. వ్యవసాయంలో హరిత విప్లవానికి స్వామినాథన్ నాయకత్వం వహించినట్లు యూఎన్ ఓ దశలో పేర్కొన్నది. ప్రపంచ శాస్త్రవేత్తల్లో అరుదైన గుర్తింపు కలిగిన వ్యక్తి స్వామినాథన్ అంటూ యూఎన్ మాజీ సెక్రటరీ జనరల్ ఓసారి కీర్తించారు.
ఆహార భద్రత కోసం ఐక్యరాజ్యసమితిలో ఆయన ఎన్నో కీలప పదవుల్ని చేపట్టారు. 1980లో ఏర్పాటు చేసిన యూఎన్ సైన్స్ అడ్వైజరీ కమిటీలో ఆయన చైర్మెన్గా చేశారు. వియన్నా యాక్షన్ ప్లాన్లో పాల్గొన్నారు. ఎఫ్ఏవో కౌన్సిల్లో ఇండిపెండెంట్ చైర్మెన్గా ఉన్నారు. ప్రకృతి, ప్రకృతివనరుల సంరక్షణ అంతర్జాతీయ సంఘానికి అధ్యక్షుడిగా చేశారు. వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్కు అధ్యక్షుడిగా చేశారు. 1961 నుంచి 72 వరకు ఇండియన్ అగ్రికల్చరల్ రీసర్చ్ ఇన్స్టిట్యూట్కు డైరెక్టర్గా చేశారాయన. వ్యవసాయ మంత్రిత్వశాఖలో ఎన్నో కీలక పదవుల్ని చేపట్టారు. పిలిప్పీన్స్లో ఇంటర్నేషనల్ రైస్ రీసర్చ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ జనరల్గా చేశారు.
ప్రొఫెసర్ మానకంబు సాంబశివన్ స్వామినాథన్.. తన రీసెర్చ్ కెరీర్ను క్రిప్టోజెనటిక్ స్టడీస్తో ప్రారంభించారు. 1949లో ఆయన ఆలుగడ్డపై తన అధ్యయనం చేపట్టారు. నెదర్లాండ్స్లో ఉన్న వాగనిన్జెన్ వ్యవసాయ యూనివర్సిటీలో ఆయన ఆలుపై స్టడీ చేశారు. 1952లో ఇంగ్లండ్లోని క్యాంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుంచి జెనటిక్స్లో పీహెచ్డీ పూర్తి చేశారు. అమెరికాలోని విస్కిన్సన్లో ఆయన పోస్టు డాక్టోరల్ రీసర్చ్ చేశారు. జెనటిక్స్, నేచర్, జర్నల్ ఆఫ్ హెరిడిటీ, జెనిటికా, యుఫిటికా, బిబిలియోగ్రాఫికా జెనటికా, అమెరికన్ జర్నల్ ఆఫ్ బాటనీ, అమెరికన్ పొటాటో జర్నల్ లాంటి పత్రికల్లో ఆయన రచనలు పబ్లిష్ అయ్యాయి.
రీసర్చ్ స్కాలర్గా ఎంఎస్ స్వామినాథన్.. ఫ్రోస్ట్ రెసిస్టాంట్ పొటాటోను డెవలప్ చేశారు. అతిశీతల వాతావరణాన్ని తట్టుకునే ఆలు వంగడాన్ని ఆయన అభివృద్ధి చేశారు. అలస్కా ఫ్రోస్ట్లెస్ అన్న వెరైటీతో ఆయన ఫేమస్ అయ్యారు. ఆ తర్వాత ఆయన అనేక పంటలకు చెందిన ఎన్నో హైబ్రిడ్ వెరైటీలను డెవలప్ చేశారు. పెరుగుతున్న ప్రపంచ జనాభాకు .. కావాల్సినంత బలవర్ధకమైన ఆహారాన్ని అందించడం సాధ్యమే అని స్వామినాథన్ అన్నారు. జీరో హంగర్ వీలవుతుందని ఆ హంగర్ ఫైటర్ చేసిన పోరాటాన్ని నేటి నేతలు అనుసరించాల్సిందే.