న్యూఢిల్లీ: ప్రధానిగారూ అంతర్జాతీయ విమానాల రాకపోకలపై నిషేధం విధించండి అని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ మరోసారి ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు. గతంలో అంతర్జాతీయ విమానాల నిషేధంపై ఆలస్యంగా నిర్ణయం తీసుకోవడంవల్లే ఫస్ట్ వేవ్ విజృంభించిందని కేజ్రివాల్ గుర్తుచేశారు. ప్రస్తుతం ఆఫ్రికా దేశాలు సహా మొత్తం 13 దేశాల్లో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రమాద ఘంటికలు మోగిస్తున్నదని, కాబట్టి ఆయా దేశాల నుంచి భారత్కు విమానాల రాకపోకలను నిలిపివేయాలని కోరారు.
అంతేగాక ఒమిక్రాన్ వేరియంట్తో రిస్క్ ఎక్కువేనని, దాని పరిణామాలు తీవ్రంగా ఉంటాయని సోమవారం ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించిన విషయాన్ని కూడా కేజ్రివాల్ గుర్తుచేశారు. ఈ మేరకు ఆయన హిందీలో ట్వీట్ చేశారు. ‘ఒమిక్రాన్ ప్రభావిత దేశాల నుంచి విమానాల రాకపోకలపై చాలా దేశాలు ఆంక్షలు విధించాయి. మనం ఎందుకు జాప్యం చేస్తున్నాం..? ఇజ్రాయెల్, జపాన్ దేశాలు పెద్దఎత్తున ప్రయాణ ఆంక్షలు విధించాయి’ అని కేజ్రివాల్ ట్విట్టర్ పేర్కొన్నారు.
‘కరోనా ఫస్ట్ వేవ్ సందర్భంగా కూడా మనం ఆలస్యంగా అంతర్జాతీయ విమానాలపై ఆంక్షలు విధించాం. ఎన్నో అంతర్జాతీయ విమానాలు ఢిల్లీకి వచ్చాయి. దాంతో ఢిల్లీలో కరోనా తీవ్ర ప్రభావం చూపింది. పీఎం గారూ.. దయచేసి విమానాల రాకపోకలపై నిషేధం విధించండి’ అని కేజ్రివాల్ ట్వీట్ చేశారు. కాగా, ఒమిక్రాన్ కలకలం మొదలైనప్పటి నుంచి విమానాలపై నిషేధం కోసం ప్రధానికి కేజ్రివాల్ విజ్ఞప్తి చేయడం ఇదే మొదటిసారి కాదు. గతంలో ఒకసారి కూడా డిమాండ్ చేశారు. మరోసారి ప్రధానికి లేఖ రాశారు.