మహారాష్ట్రలోని అమరావతి ఎంపీ నవనీత్ కౌర్, ఆమె భర్త, స్వతంత్ర ఎమ్మెల్యే రవి రాణాను ముంబై పోలీసులు శనివారం సాయంత్రం అరెస్ట్ చేశారు. ఆదివారం లేదా సోమవారం వారిద్దర్నీ బాంద్రాలోని కోర్టు ముందు ప్రవేశపెట్టనున్నారు. వీరిద్దరిపై ఐపీసీ 153ఏ సెక్షన్ కింద కేసులు నమోదు చేశారు.
ఎంపీ నవనీత్ రాణా దంపతులిద్దరూ మతపరమైన భావాలను రెచ్చగొట్టారంటూ శివసేన నేతలు ఆరోపణలు చేశారు. దీంతో పోలీసులు వారిద్దర్నీ విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. ఆ తర్వాత వారిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
ఇక మరోవైపు నవనీత్ రాణా ఓ వీడియోను విడుదల చేశారు. తనను పోలీసులు జబ్రన్ పీఎస్కు తీసుకెళ్తున్నారని ఆ వీడియోలో తెలిపారు. తనకు మద్దతివ్వాలని మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, నారాయణ్ రాణేను కోరారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి తనకు మద్దతివ్వాలని ఆమె ఆ వీడియోలో వారిద్దర్నీ కోరారు.
ఏం జరిగిందంటే…
అమరావతి ఎంపీ నవనీత్ రాణా దంపతులు సీఎం ఉద్ధవ్ ఠాక్రే ఇంటి ముందు హనుమాన్ చాలీసా పఠిస్తామని హెచ్చరించడంతో గొడవ ప్రారంభమైంది. దీంతో శనివారం ఉదయం శివసేన కార్యకర్తలు ముంబైలోని ఆమె ఇంటి ముందు నిరసన తెలిపారు. మాతోశ్రీ వెలుపల హనుమాన్ చాలీసాను పఠిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త వాతారవణం ఏర్పడింది. మరోవైపు నవనీత్ రాణా దంపతుల ఇంటి ముందు కూడా భారీగా పోలీసులను మోహరించారు.
శనివారం సాయంత్రానికి ఎంపీ నవనీత్ రాణా దంపతులు వెనక్కి తగ్గారు. మాతోశ్రీ ముందు హనుమాన్ చాలీసా పఠించాలన్న కార్యక్రమాన్ని విరమించుకుంటున్నట్లు ప్రకటించారు. తాము కపట హనుమాన్ భక్తులపై నిరసన తెలుపాలని అనుకున్నామని పేర్కొన్నారు. అయితే వారు తమ ఇంటి పైకి గుండాలను పంపారని, దీని ద్వారా వారి వాస్తవ రూపం ఏమిటో ప్రజలకు అర్థమైందన్నారు. ప్రజలకు వాస్తవ రూపం తెలిసి కాబట్టి, మాతోశ్రీ ముందు హనుమాన్ చాలీసా పఠించాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్లు వారు వెల్లడించారు.