MPhil | న్యూఢిల్లీ : ఎంఫిల్(మాస్టర్ ఆఫ్ ఫిలాసఫీ) కోర్సులపై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) కీలక హెచ్చరిక జారీ చేసింది. ఎంఫిల్కు ఎలాంటి గుర్తింపు లేదని యూజీసీ సెక్రటరీ స్పష్టం చేశారు. దేశంలోని ఆయా యూనివర్సిటీలు అందించే ఎంఫిల్ ప్రోగ్రామ్లకు ఎలాంటి గుర్తింపు లేదని తేల్చిచెప్పారు. ఈ నేపథ్యంలో ఎంఫిల్ ప్రవేశాలు ఎవరూ తీసుకోవద్దని సూచించారు.
ఎంఫిల్ కోర్సులను యూజీసీ రద్దు చేసిందని సెక్రటరీ గుర్తు చేశారు. అయినప్పటికీ కొన్ని యూనివర్సిటీలు ఎంఫిల్ కోర్సులను అందిస్తున్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో 2023-24 విద్యాసంవత్సరంలో ఎంఫిల్ కోర్సులు నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసిన విషయాన్ని యూజీసీ గుర్తు చేసింది. ప్రస్తుతం కొన్ని యూనివర్సిటీలు ఎంఫిల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిసింది. ఆ విషయం యూజీసీ దృష్టికి రావడంతో మరోసారి హెచ్చరించాల్సి వచ్చిందని తెలిపారు.