న్యూఢిల్లీ, డిసెంబర్ 27: ఎంఫిల్ (మాస్టర్ ఆఫ్ ఫిలాసఫీ)పై యూజీసీ కీలక హెచ్చరిక చేసింది. ఈ డిగ్రీకి యూజీసీ గుర్తింపు లేదని, ఈ కోర్సుల్లో విద్యార్థులు చేరొద్దని సూచించింది. అలాగే యూనివర్సిటీలు ఎంఫిల్ కోర్సులను ఆఫర్ చేయరాదని స్పష్టంచేసింది. ‘ఎంఫిల్ ప్రవేశాల కోసం పలు వర్సిటీలు అడ్మిషన్లు కోరుతున్నట్టు మా దృష్టికి వచ్చింది. ఎంఫిల్కు యూజీసీ గుర్తింపు లేదు. ఉన్నత విద్యాసంస్థలు ఎంఫిల్ ప్రోగ్రామ్ను ఆఫర్ చేయరాదని యూజీసీ నిబంధనలు(పీహెచ్డీ ప్రదానానికి కనీస ప్రమాణాలు, విధానాలు)-2022 రెగ్యులేషన్ నంబర్ 14 స్పష్టంగా చెబుతున్నది’ అని యూజీసీ సెక్రటరీ మనీశ్ జోషీ పేర్కొన్నారు. 2023-24కు సంబంధించి ఎంఫిల్ అడ్మిషన్ల ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని యూనివర్సిటీలను కోరారు. మరోవైపు విద్యార్థులు కూడా ఎంఫిల్ ప్రోగ్రామ్లో అడ్మిషన్లు తీసుకోవద్దని సూచించారు. పీహెచ్డీ రెగ్యులేషన్స్కు ముందు ప్రారంభమైన ఎంఫిల్ కోర్సులు మాత్రం కొనసాగుతాయని, అందులో చేరిన విద్యార్థులు ఎంఫిల్ పూర్తిచేయొచ్చని వివరించారు.