భోపాల్: గుడిసెలో నివాసం ఉండే ఒక వృద్ధురాలికి ఏకంగా రూ.2.5 లక్షల కరెంట్ బిల్లు వచ్చింది. దీంతో ఆందోళన చెందిన ఆమె ఆ బిల్లు పట్టుకుని కరెంట్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నది. మధ్యప్రదేశ్లోని గునాలో ఈ ఘటన జరిగింది. రాంబాయి ప్రజాపతి అనే 65 ఏండ్ల వృద్ధురాలు పూరి గుడిసెలో ఉంటున్నది. ఆమె ఇంట్లో ఒక బల్బు, ఒక టేబుల్ ఫ్యాన్ మాత్రమే ఉన్నాయి. దీంతో ప్రతి నెల రూ.300 నుంచి రూ.500 వరకు కరెంట్ బిల్లు వచ్చేంది. అయితే కరోనా లాక్డౌన్ నేపథ్యంలో గత రెండు నెలలుగా ఆమె విద్యుత్ బిల్లులు చెల్లించ లేదు. ఈ నేపథ్యంలో ఇటీవల ఏకంగా రూ.2.5 లక్షల కరెంట్ బిల్లు వచ్చింది. దీనిని చూసి షాకైన రాంబాయి ఆ కరెంట్ బిల్లు పట్టుకుని గత వారం రోజులుగా విద్యుత్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నది. అయితే ఎవరూ కూడా దీని గురించి పట్టించుకోవడం లేదని ఆమె ఆరోపించింది. స్థానిక ప్రజాపతితోపాటు జిల్లా కలెక్టర్ను కలిసినప్పటికీ తన సమస్య పరిష్కారం కాలేదని ఆ వృద్ధురాలు వాపోయింది.