హైదరాబాద్ : కొత్త పార్లమెంట్ భవనానికి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నాయకుడు, ఖమ్మం పార్లమెంట్ సభ్యుడు నామా నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం పార్లమెంట్ లో ఎంపీ నామ మాట్లాడారు. తెలంగాణ సీఎం కేసీఆర్ మెరుగైన సుపరిపాలన వల్ల తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో నంబర్ వన్గా ఉందని పేర్కొన్నారు.
అలాగే దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ నూతన సచివాలయానికి బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టడమే కాకుండా హైదరాబాద్లో 125 అడుగుల అతిపెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి దళిత పక్షపాతిగా మారిన విషయాన్ని గుర్తు చేశారు. అంతేకాకుండా దళిత బంధు పథకం ప్రవేశపెట్టి, దళితులకు రూ.10 లక్షల వంతున వారి అభివృద్ధికి సాయం చేస్తున్నారని చెప్పారు.
ఇంకా రైతుబంధు, రైతుబీమా, రైతులకు 24 గంటల ఫ్రీ కరెంట్ ఇస్తున్న దేశంలో ఏకైక రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు. నేడు కేసీఆర్ సుపరిపాలన వల్ల తెలంగాణ అన్నింటా నబర్ వన్గా ఉందన్నారు. ఇదే పార్లమెంట్లో రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొస్తే, వ్యతిరేకిస్తే ఉపసంహరించుకున్న సంగతిని, 2014లో ఏపీ రీ ఆర్గనేషన్ యాక్ట్ ఆమోదాన్ని గుర్తు చేశారు.
ఈ ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లోనే బీసీ, మహిళా రిజర్వేషన్ల బిల్లులను ప్రవేశపెట్టి, అమోదించాలని నామ పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ విషయమై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే ప్రధానమంత్రి మోదీకి లేఖ కూడా రాసిన సంగతిని ఆయన గుర్తు చేశారు.