Ujjaini Mahakaleshwar : తమిళనాడులోని దేవాలయాల్లోకి మొబైల్ ఫోన్లను అనుమతించ వద్దని ఈ మధ్యే మద్రాస్ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాదు భక్తులకు డ్రెస్కోడ్ తప్పనిసరి చేయాలని దేవాదయ శాఖను ఆదేశించింది. ఇప్పుడు మధ్యప్రదేశ్లోని ప్రముఖ దేవాలయంలో కూడా ఫోన్లపై నిషేధం అమలులోకి రానుంది. ఉజ్జయిని మహకాళేశ్వర్ ఆయంలోనూ ఫోన్లపై నిషేధం విధించనున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు జిల్లా కలెక్టర్ ఆశిష్ సింగ్ తెలిపారు. డిసెంబర్ 20వ తేదీ నుంచి ఈ నిషేధం అమలులోకి వస్తుంది. ఫోన్లపై నిషేధం గురించి ఉజ్జయినిలో భక్తులు బసచేసే హోటళ్లు, లాడ్జీలకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. దాంతో, భక్తులు తాము బస చేసే చోట ఫోన్లు వదిలేసి వస్తారని అశిష్ వెల్లడించారు.
ఉజ్జయిని మహంకాళేశ్వర్ దేవాలయ కమిటీ, ఛైర్మన్తో, కలెక్టర్ సమావేశం అయ్యారు. సెక్యూరిటీ కారణాల వల్ల ఆలయం లోపలికి ఫోన్లను అనుమతించ వద్దనే నిర్ణయానికి వచ్చారు. అంతేకాదు పర్యాటకుల కోసం ఏసీ ఎలక్ట్రిక్ బస్సులను నడుపుతామని వెల్లడించారు. ఆ బస్సులు దేవాలయాలు ఉన్న ప్రాంతాలకు వాళ్లను తీసుకెళ్తాయని చెప్పారు. భక్తుల సౌకర్యార్థం త్వరలోనే ఒక కాల్ సెంటర్ను కూడా ఏర్పాటు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. 50 ఫోన్లైన్స్ను అందుబాటులో ఉంచనున్నారు. మనదేశంలోని 12 జ్యోతిర్లింగాలలో ఉజ్జయిని మహకాళేశ్వర్ ఆలయం ఒకటి. ఇక్కడికి ప్రతి ఏడాది వేల సంఖ్యంలో భక్తులు తరలివస్తారు.
ఆలయాల స్వచ్ఛత, పరిశుద్ధత కాపాడేందుకు మొబైల్ ఫోన్లపై నిషేధం విధించాలని మద్రాస్ హైకోర్టు సంచలన ఆదేశాలు ఇచ్చింది. ఇప్పటికే ఆ రాష్ట్రంలోని తిరుచెండూర్ ఆలయంలోకి మొబైల్ ఫోన్లను అనుమతించడం లేదు. భక్తులు, ఆలయ ఉద్యోగులు, అధికారులు ఎవరూ కూడా గుడిలోపలికి తీసుకెళ్లడానికి వీలు లేదు. ఫోన్లను డిపాజిట్ చేయడానికి గుడి బయట ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు.