బెంగళూరు: ఒక పాప తల్లి అక్రమ సంబంధానికి ప్రాముఖ్యత ఇచ్చింది. ఈ నేపథ్యంలో చైల్డ్ కస్టడీ కేసు పోరాటంలో ఆ చిన్నారి తండ్రి గెలిచాడు. కర్ణాటక హైకోర్టు ఈ మేరకు తీర్పు ఇచ్చింది. ఫ్యామిలీ కోర్టు జడ్జిమెంట్ను సమర్థించింది. ఒక మహిళ సవాల్ పిటిషన్ను తిరస్కరించింది. డాక్టర్లైన జంటకు గతంలో పెళ్లిళ్లు కాగా విడాకులు కూడా పొందారు. మ్యాట్రిమోనియల్ సైట్ ద్వారా పరిచయమైన వారిద్దరూ 2011లో వివాహం చేసుకున్నారు. 2015లో వారికి ఒక పాప జన్మించింది. అనంతరం భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చాయి. దీంతో ఒకరిపై మరొకరు ఫిర్యాదు చేయడంతో కేసులు నమోదయ్యాయి.
కాగా, 2018లో ఆ మహిళ పాపను తీసుకుని భర్త ఇంటి నుంచి వెళ్లిపోయింది. పాపను చండీగఢ్లోని తన పేరెంట్స్కు అప్పగించింది. మరో వ్యక్తితో కలిసి బెంగళూరులో సహజీవనం చేస్తున్నది. ఈ విషయం తెలిసిన ఆ మహిళ భర్త పాప కస్టడీ కోసం ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాడు. అక్రమ సంబంధానికి భార్య ప్రాముఖ్యత ఇవ్వడంతో తన పాప సరైన వాతావరణంలో పెరుగడం లేదని కోర్టుకు తెలిపాడు. దీనికి సంబంధించిన ఆధారాలు చూపాడు. పాప జీవితం, భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేశాడు. దీంతో ఆ పాప కస్టడీని తండ్రికి అప్పగిస్తూ గత ఏడాది మార్చిలో ఫ్యామిలీ కోర్టు తీర్పు ఇచ్చింది.
మరోవైపు ఫ్యామిలీ కోర్టు తీర్పును ఆ మహిళ కర్ణాటక హైకోర్టులో సవాల్ చేసింది. ఆమె పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు, ఫ్యామిలీ కోర్టు తీర్పును సమర్థించింది. అక్రమ సంబంధానికి తల్లి ప్రాధాన్యత ఇవ్వడంతో పాప కస్టడీని తండ్రికి అప్పగించడం సబబే అని పేర్కొంది. అయితే పాపను కలిసే హక్కును ఆ తల్లికి కల్పించింది. ప్రతి ఆదివారం, సెలవు రోజులు, ముఖ్యమైన పండుగలప్పుడు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట మధ్య తన బిడ్డను కలుసుకోవచ్చని తెలిపింది. అలాగే వేసవి సెలవుల్లో పది రోజుల పాటు పాపను ఆమె వద్ద ఉంచుకోవచ్చని పేర్కొంది. వైద వృత్తిలో ఉండి, సమాజంలో బాధ్యతగల వారైన వారిద్దరూ తమ తప్పును గ్రహించి పాప భవిష్యత్తు, సంక్షేమం కోసం కలిసి రావాలని సూచించింది.