జైపూర్ : ఐదుగురు కూతుళ్లతో కలిసి తల్లి బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నది. ఈ విషాదకర ఘటన రాజస్థాన్ కోటాలోని కల్యాఖేడి గ్రామంలో చోటు చేసుకున్నది. తల్లితో పాటు ఐదుగురు ఆడ పిల్లలు నీటిలో మునిగి మృత్యువాతపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను బావిలో నుంచి వెలికి తీశారు. ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. బాదం దేవి అనే మహిళ భర్త శివలాల్తో గొడవలు ఉన్నాయని, ఈ క్రమంలోనే గత గురువారం ఆమె ఏడుగురు కూతుళ్లతో కలిసి ఇల్లు వదిలి వెళ్లింది.
ఆదివారం ఉదయం గ్రామంలోని ఓ బావిలో బాలిక మృతదేహం తేలడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత తల్లితో పాటు మరో నలుగురు బాలికల మృతదేహాలను వెలికి తీశారు. అయితే, మరో ఇద్దరు బాలికలు మాత్రం బావి వద్ద కనిపించారు. ఐదుగురు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా దిగ్భ్రాంతి గురి చేసింది. కుటుంబ సమస్యలతోనే ఆత్మహత్య చేసుకుని ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.