మార్బీ బ్రిడ్జ్ ప్రమాద ఘటనలో గుజరాత్ ప్రభుత్వానికి హైకోర్ట్ నోటీసులు జారీ చేసింది. ఈ వంతెన ప్రమాదం గురించి నవంబర్ 14వ తేదీన వాదనలు విననుంది హైకోర్ట్. ఈ ప్రమాదాన్ని హైకోర్ట్ సుమోటోగా స్వీకరించింన హైకోర్ట్ వాదనల సమయాని కల్లా ఈ ఘటనపై నివేదక సమర్పించాలని హోమ్ సెక్రెటరీ, చీఫ్ సెక్రెటరీ, మున్సిపల్ కమిషనర్, జిల్లా కలెక్టర్ని ఆదేశించింది. అంతేకాదు రాష్ట్ర మానవహక్కుల సంఘంని కూడా నివేదిక సమర్పించాల్సిందిగా హైకోర్ట్ కోరింది. ‘మార్బీ వంతెన ప్రమాదాన్ని సుమోటోగా తీసుకున్నాం. నవంబర్ 14న సెలవు రోజు. అయినా కూడా మేము ఆ రోజు ఈ కేసు వాదనలు వింటాం’ అని చెప్పారు గుజరాత్ హైకోర్ట్ ఛీఫ్ జస్టిస్ అరవింద్ కుమార్.
సుమోటోగా ఎప్పుడంటే…
ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు, ప్రజల ప్రాణాలు, ఆస్తులకు ఆటంకం ఏర్పడిన సంఘటనల్ని సుమోటోగా తీసుకునే అధికారం సుప్రీంకోర్టు, హైకోర్టులకు ఉంది. ఎవరూ పిటిషన్ వేయని, కోర్టు దృష్టికి తీసుకురాని విషయాల్న కోర్టులు సుమోటోగా ఎక్కువగా తీసుకుంటాయి.
మర్బీలోని మచ్చు నదిపై బ్రిటీష్ కాలంలో ఈ తీగల వంతెనని నిర్మించారు. బ్రిడ్జి కొంతభాగం దెబ్బతినడంతో ఒరేవా అనే కంపెనీకి మరమ్మతు పనులు అప్పగించారు మర్బీ మున్సిపల్ అధికారులు. ఏడు నెలల మరమ్మతు పనుల తర్వాత బ్రిడ్జిని అక్టోబర్ 26వ తేదీన సందర్శకుల కోసం తెరిచారు. బ్రిడ్జి సామర్థ్యానికి మించి ఎక్కువ మందిని అనుమతించడంతో ఒక్కసారిగా వంతెన కుప్పకూలింది. 135 మంది జలసమాధి అయ్యారు. చాలామంది గాయపడ్డారు. ఈ ఘటన మీద విచారణ చేపట్టిన పోలీసులు ఇప్పటికే తొమ్మిది మందిని అరెస్ట్ చేశారు. వీళ్లలో ఒరేవా గ్రూప్ ప్రతినిధులు నలుగురు ఉన్నారు.