సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణంలో లజ్జగౌరీ, బ్రహ్మ, విష్ణు, శివుడు, కాలభైరవుడి శిల్పాలను గుర్తించారు. డిస్కవరీ మ్యాన్ రెడ్డి రత్నాకర్రెడ్డి తన పరిశోధనలో భాగంగా ఆదివారం వీటిని వెలుగులోకి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా రత్నాకర్రెడ్డి మాట్లాడుతూ.. మాతృత్వానికి దైవత్యం ఆపాదించిన గొప్ప శిల్పమే లజ్జ గౌరీ అని.. సృష్టికి, శక్తి స్వరూపానికి ప్రతీకగా పేర్కొన్నారు. లజ్జగౌరీని అమ్మదేవత అంటారని ఇంగ్లిష్లో మదర్గాడెస్, మదర్ఎర్త్ అని పిలుస్తారని వెల్లడించారు. చేర్యాల పట్టణానికి దూరంగా కొత్త సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ సమీపంలో పంట చేల మధ్య బయ్యన్న గుండుపై భైరవుడి శిల్పంతోపాటు గంటు చిత్రంగా కాకతీయుల కాలం నుంచి లజ్జగౌరీ చిత్రం ఉన్నదని పేర్కొన్నారు. సమృద్ధిగా పంటలు పండాలని, సంతాన భాగ్యం కలుగాలని ప్రజలు లజ్జగౌరీని వేడుకుంటారని తెలిపారు. అలాగే బ్రహ్మ, విష్ణు, శివుని విగ్రహాలు వెలుగులోకి తీసుకువచ్చానని, చారిత్రక ఆధారాలను పోగొట్టుకుంటూ వస్తున్న తెలంగాణలో అరుదైన చిత్రం బయటపడటం విశేషమన్నారు.