న్యూఢిల్లీ: ఆస్పత్రి ఆపరేషన్ థియేటర్లోకి వైద్యులు, వైద్య సిబ్బందికి తప్ప ఇతరులు ఎవ్వరికీ అనుమతి ఉండదు. రోగులనే తప్ప రోగి అటెండెంట్లను కూడా లోపల కాలు పెట్టనివ్వరు. అలాంటిది దేశ రాజధాని ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో మాత్రం ఏకంగా కోతులే ఆపరేషన్ థియేటర్లోకి చొరబడుతున్నాయి. సిబ్బందికి కోతులను తరమడమే ఒక పనిగా మారిపోయింది. కోతుల బెడదతో ఆస్పత్రి సిబ్బందితోపాటు రోగులు, రోగుల అటెండెంట్లు కూడా ఆందోళన చెందుతున్నారు.
ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రిలో తాజాగా ఘటన చోటుచేసుకుంది. సాధారణంగా ఆస్పత్రి ఆవరణలో కోతులను తరిమేందుకు లంగూర్ కీపర్స్ ఉండేవాళ్లని, దాంతో కోతులు ఆస్పత్రిలోకి ప్రవేశించే అవకాశం ఉండేది కాదని సిబ్బంది చెబుతున్నారు. కానీ, ఇప్పుడు జీ20 సమావేశాల నేపథ్యంలో లంగూర్ కీపర్లను అక్కడికి తరలించారని, దాంతో కోతులను నియంత్రించడం కష్టతరంగా మారిందని తెలిపారు.