Mongoloids | ఐజ్వాల్ : చాలా ఏండ్ల క్రితమే మన దేశానికి వలస వచ్చి నివసిస్తున్న యూదు జాతీయుల తెగ త్వరలో కనుమరుగు కానున్నది. మిజోరంలో నివసిస్తున్న ఒక తెగను ప్రాచీన ఇజ్రాయెల్ వంశస్థులుగా 2009లో గుర్తించారు. భారత్కు వలస వచ్చిన యూదులకు చెందిన ఆఖరి తెగగా భావిస్తున్నారు. కొద్దికొద్దిగా తమ పూర్వీకుల ప్రాంతమైన ఇజ్రాయెల్కు తరలిపోతుండటంతో ఈ తెగ ఇక అంతరించిపోనుందని అధికారులు అంటున్నారు. ఈ తెగ ఉత్తర హిమాలయ ప్రాంతంలో నివసిస్తున్నట్టు ఇజ్రాయెల్ వీరిని గుర్తించింది.
ప్రాచీన ఇజ్రాయెల్ జాతీయులైన వీరిని బ్నే మెనాషె (బీఎం)గా 2009లో గుర్తించారు. ఆ దేశ చట్టాల ప్రకారం వారు దేశ పౌరులుగా తమ దేశానికి వెనక్కి వచ్చే హక్కు కలిగి ఉంటారు. మిజోలో అనుసరిస్తున్న సంప్రదాయాలు యూదుల సంప్రదాయాలను పోలి ఉంటాయని చెబుతూ జంతుబలి ప్రక్రియలను స్థానికులు ఉదాహరిస్తున్నారు. జంతువులను బలి ఇచ్చేటప్పుడు ఇజ్రాయెల్లో పూజారులు వాటి రక్తాన్ని నేలపై జల్లుతారని, మిజోరంలో కూడా ఇలాంటి సంప్రదాయాన్నే పాటిస్తారని వారు తెలిపారు.