కోల్కతా : టీచర్స్ రిక్రూట్మెంట్ స్కాంకు సంబంధించి పార్ధా ఛటర్జీ సన్నిహితురాలు అర్పితా ముఖర్జీ నివాసాల్లో ఈడీ స్వాదీనం చేసుకున్న రూ 50 కోట్ల నగదుపై అర్పిత కీలక వ్యాఖ్యలు చేశారు. తాను లేని సమయంలో తన ఫ్లాట్లో డబ్బును ఉంచారని ఆమె చెప్పుకొచ్చారు.
టీచర్స్ రిక్రూట్మెంట్ స్కాంలో అరెస్టయిన బెంగాల్ మాజీ మంత్రి పార్ధా ఛటర్జీ ఆయన సన్నిహితురాలు అర్పితా ముఖర్జీలను ఆగస్ట్ 3 వరకూ ఈడీ కస్టడీకి న్యాయస్ధానం తరలించింది. జులై 22న అర్పితా నివాసంపై ఈడీ దాడుల్లో రూ 21.90 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు. రూ 56 లక్షల విదేశీ నగదు, రూ 76 లక్షల విలువైన బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఆపై అర్పిత మరో ఫ్లాట్లో జరిపిన దాడుల్లో రూ 28.90 కోట్ల నగదు పట్టుబడింది.
ఐదు కిలోల బంగారం, పలు కీలక పత్రాలను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. భారీ మొత్తంలో పట్టుబడిన నగదు, బంగారం టీచర్ రిక్రూట్మెంట్ స్కాం ద్వారా రాబట్టిన ముడుపుల సొమ్ముగా భావిస్తున్నారు. ఇక ఈ సొమ్ము తనది కాదని, తనకు వ్యతిరేకంగా కుట్ర జరిగిందని పార్ధ ఛటర్జీ ఆరోపిస్తున్నారు. టీచర్స్ రిక్రూట్మెంట్ స్కామ్ వెలుగుచూసిన నేపధ్యంలో పార్ధ ఛటర్జీని పార్టీ పదవుల నుంచి టీఎంసీ తప్పించగా, మమతా కేబినెట్ నుంచి కూడా ఆయనను తొలగించారు.