Mughal History | న్యూఢిల్లీ, ఏప్పిల్ 3: ఇక చరిత్ర పుస్తకాల్లో మొఘల్ సామ్రాజ్యం అనే పాఠం కనిపించదు. 12వ తరగతి చరిత్ర పుస్తకంలోని ‘మొఘల్ సామ్రాజ్యం’ చాప్టర్లను నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రిసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్సీఈఆర్టీ) తొలగించింది. ఈ మార్పు దేశవాప్తంగా ఎన్సీఈఆర్టీని అనుసరించే అన్ని స్కూల్స్కు వర్తించనున్నది. థీమ్స్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ పార్ట్-2లో ఉన్న ‘కింగ్ అండ్ క్రానికల్స్: ది మొఘల్ కోర్ట్స్ (సీ.16,17వ శతాబ్దాలు) చాప్టర్లను పూర్తిగా తొలగించింది. హిస్టరీతోపాటు హిందీ, సివిక్స్ పుస్తకాల్లోనూ మార్పులు చేసింది. 10, 11వ తరగతి పుస్తకాల్లోనూ పలు పాఠ్యాంశాలను ఎన్సీఈఆర్టీ తొలగించింది. ఈ మార్పులు 2023-24 విద్యా సంవత్సరం నుంచే అమలవుతాయని ఎన్సీఈఆర్టీ పేర్కొన్నది.
హైదరాబాద్, ఏప్రిల్ 3 (నమస్తే తెలంగాణ): మొఘల్ చరిత్రను తొలగించటం బీజేపీ సర్కార్ మూర్ఖత్వానికి పరాకాష్ట అని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ ఆరోపించారు. సిలబస్ను మోదీ తొలగించగలరేమో కానీ వారసత్వ ప్రతీకలుగా ఉన్న చారిత్రక నిర్మాణాలను తొలగించలేరని స్పష్టం చేశారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ఎర్రకోట నుంచే జాతీయ పతాకాన్ని ఎగురవేస్తున్నారని, దాన్ని నిర్మించింది మొఘల్ పాలకులన్న స్పృహ కూడా మోదీకి లేకపోవడం దుర్మార్గమన్నారు. ఈ మేరకు శ్రవణ్ సోమవారం ట్వీట్ చేశారు.