అచ్చేదిన్ తెస్తామంటూ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన మోదీ సర్కారు.. ఈ ఎనిమిదేండ్ల పాలనలో ప్రజాసంక్షేమం మాట అటుంచితే.. నిత్యం వివాదాస్పద, అనాలోచిత నిర్ణయాలతో ప్రజలను నిలువునా ముంచింది. దేశాన్ని అగ్నిగుండంగా మార్చింది.
1. బ్లాక్ మనీ: బీజేపీ అధికారంలోకి వస్తే స్విస్ బ్యాంకులో ఉన్న నల్ల ధనాన్ని మొత్తం వెనక్కిరప్పిస్తామని మోదీ 2014 ఎన్నికల ప్రచారంలో ప్రగల్భాలు పలికారు. ప్రతీ ఒక్కరి ఖాతాలో రూ.15 లక్షలు జమ చేస్తామన్నారు. వాస్తవంలో మాత్రం బ్లాక్ మనీ వెనక్కు తీసుకురాకపోగా.. బీజేపీ పాలనతో స్విస్ బ్యాంకులో భారతీయుల బ్లాక్ మనీ పెరిగింది. గడిచిన ఏడాదిలోనే ఇండియన్ల ఖాతాల్లో డబ్బు రెట్టింపు అయిందని ఇటీవలే స్విస్ బ్యాంకు ప్రకటించింది.
2. నోట్ల రద్దు: నోట్లను రద్దు చేయడం ద్వారా నకిలీ నోట్లను అరికడతామని, అవినీతి సొమ్ము బయటకు వస్తుందని మోదీ సర్కారు పెద్ద నోట్ల రద్దు చేసింది. కోట్లాది మంది పేదలను బ్యాంకుల ముందు లైన్లలో నిలబెట్టింది. వందలాది మంది బ్యాంకు లైన్లలోనే ప్రాణాలు కోల్పోయారు. చిరు వ్యాపారులు చావు దెబ్బ తిన్నారు. అయినప్పటికీ నోట్ల రద్దు విఫలం అయింది. చలామణీలో ఉన్న మొత్తం నగదు బ్యాంకుల్లో చేరింది.
3. జీఎస్టీ: అనేక రకాల పన్నులతో వ్యాపారులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ఒకే దేశం-ఒకే ట్యాక్స్ ఉంటే సులువుగా ఉంటుందని కేంద్రం రాష్ర్టాలను బలవంతంగా ఒప్పించి మరీ జీఎస్టీని తీసుకువచ్చింది. హేతుబద్ధత లేని ట్యాక్స్ స్లాబులతో ఎన్నో వ్యాపారాలు దెబ్బతిన్నాయి.
4. సీఏఏ: పొరుగుదేశాల్లో మతపరమైన హింసను ఎదుర్కొంటున్నవారికి ఆశ్రయం కల్పిస్తామంటూ బీజేపీ సర్కారు పౌరసత్వ చట్టానికి సవరణ చేసింది. దీనిపై దేశవ్యాప్తంగా ఉద్యమం ఎగిసిపడింది. ఎన్నార్సీ, ఎన్పీఆర్పైనా నిరసనలు చెలరేగాయి.
5. ప్రైవేటీకరణ: ప్రభుత్వ రంగ ఆస్తులను అమ్మడమే పనిగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు కొంతకాలంగా తీవ్ర చర్చకు దారి తీసింది. ఎల్ఐసీలో కొంత వాటాను ప్రైవేటు పరం చేయడం, సంస్థ ప్రతిష్ఠను దెబ్బతీయడంపై దేశవ్యాప్తంగా విమర్శలు వస్తున్నాయి. అలాగని డిజిన్వెస్ట్మెంట్ లాభానికి చేస్తున్నారా అంటే అదీ లేదు. ప్రభుత్వ ఆస్తులను కారు చౌకగా అనుయాయులకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు.
6. లాక్డౌన్: కరోనా నేపథ్యంలో ప్రధాని మోదీ రాత్రికిరాత్రే దేశవ్యాప్త లాక్డౌన్ ప్రకటించారు. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రవాణా సదుపాయాలు లేక వేలాది మంది వలస కార్మికులు కాలినడక వేల కిలోమీటర్ల దూరం నడుచుకొంటూ స్వస్థలాలకు వెళ్లారు. మార్గ మధ్యలో ఆకలికి తాళలేక, ప్రమాదాల్లో వందలాది మంది చనిపోయారు.
7. సాగుచట్టాలు: రైతులు వ్యతిరేకించినప్పటికీ కేంద్ర ప్రభుత్వం మొండిగా సాగు చట్టాలను తీసుకువచ్చింది. రైతులు ఏడాదికి పైగా ఆందోళనలు చేశారు. నిరసనల్లో ఏడు వందల మందికి పైగా రైతులు చనిపోయారు. చివరికి ప్రధాని మోదీ తాపీగా.. రైతులకు సారీ చెప్పి సాగు చట్టాలను వెనక్కు తీసుకొంటున్నట్టు ప్రకటించారు.
8. అగ్నిపథ్: రెండేండ్ల పాటు ఆర్మీ రిక్రూట్మెంట్ను నిలిపివేసిన కేంద్రప్రభుత్వం ఇప్పుడు అగ్నిపథ్ పేరుతో దేశంలో మళ్లీ అగ్గి రాజేసింది. ఖర్చులను తగ్గించుకోవడం కోసమని ఆర్మీని కాంట్రాక్టు సైన్యంతో నింపే ప్రయత్నం చేస్తున్నది. యువత జీవితాలతో ఆడుకొంటూ ఏకంగా దేశ భద్రతపైనే ప్రయోగాలు చేస్తున్నది.