మూడో విడతా తానే ప్రధానమంత్రి అంటూ ఆరెస్సెస్కు సంకేతాలు
75 ఏండ్ల నియమం తనకు వర్తించదంటున్న నరేంద్ర మోదీ
న్యూఢిల్లీ, మే 13: బీజేపీలో రూల్స్ అందరికీ ఉంటాయి కానీ తనకు మాత్రం ఉండవని అంటున్నారు ప్రధాని మోదీ. బీజేపీలో 75 ఏండ్లు దాటిన నేతలను పక్కన పెట్టాలని ఆరెస్సెస్ నియమం పెట్టింది. ఆరెస్సెస్ ఇదివరకటి చీఫ్ కూడా ఈ నియమం ప్రకారమే రిటైరయ్యారు. మోదీ మాత్రం తనకు ఈ నియమాలు వర్తించవని తమ పార్టీకి మాతృసంస్థ అయిన ఆరెస్సెస్కు పరోక్షంగా వెల్లడించారు. దిగ్గజ నేతలు ఎల్కే అద్వానీ, మురళీమనోహర్ జోషిని ఎందుకు పక్కన పెడుతున్నారంటే 75 ఏండ్లు నిండినవారికి టికెట్లు ఇవ్వడం లేదని గత పార్లమెంటు ఎన్నికల సందర్భంగా అప్పటి పార్టీ అధ్యక్షుడు అమిత్ షా ప్రకటించారు. ఆ రూల్ ప్రకారమే షా గాంధీనగర్ స్థానాన్ని అద్వానీ నుంచి లాగేసుకున్నారు కూడా. 1950 సెప్టెంబర్ 17న జన్మించిన మోదీ మరో మూడేండ్లలో 75వ మైలురాయి దాటేస్తారు.
మరి పార్టీ నియమం ప్రకారం ఆయన తప్పుకొంటారా? అంటే ససేమిరా అంటున్నారు. ఇప్పటికే రెండు సార్లు ప్రధాని పదవి చేపట్టారు.. ఇక మూడో విడత వద్దు అని తాను ఎంతగానో గౌరవించే ఓ విపక్ష నేత మోదీకి సూచించారట. కానీ తాను మాత్రం తప్పుకొనేదే లేదని నర్మగర్భితంగా స్పష్టం చేశారు. గుజరాత్లోని భారుచ్లో జరుగుతున్న ఉత్కర్ష్ సమారోహ్ను ఉద్దేశించి చేసిన వర్చువల్ ప్రసంగంలో స్వయంగా మోదీ ఈ సంగతి వెల్లడించారు. ‘దేశం మీకు రెండు సార్లు ప్రధాని పదవిని కట్టబెట్టింది. అంతకన్నా ఏం కావాలి. రెండు సార్లు ఆ ఉన్నత పదవిని చేపడితే ఇంకా సాధించాల్సింది ఏమీ ఉంది’ అన్నట్టుగా ఆ విపక్ష నేత తనతో అన్నారట. కానీ తాను వేరే మట్టితో తయారైనవాడినని మోదీ చెప్పుకొచ్చారు. సంక్షేమ పథకాల విస్తృతి 100% సాధించే దాకా విశ్రాంతి తీసుకోనని అంటూ చెప్పుకొచ్చారు.