లక్నో: రైతులు, చిరు వ్యాపారులకు ప్రధాని నరేంద్ర మోదీ శ్రేయోభిలాషి కాదని ఒక వ్యాపారి ఆరోపించారు. ఫేస్బుక్ లైవ్లో ఆత్మహత్యాయత్నం చేశారు. గురువారం తొలి దశ పోలింగ్ జరుగనున్న ఉత్తరప్రదేశ్లో ఈ ఘటన జరిగింది. బాఘ్పత్కు చెందిన 40 ఏండ్ల రాజీవ్ తోమర్, చెప్పుల వ్యాపారి. అప్పులపాలైన ఆయన మంగళవారం ఫేస్బుక్ లైవ్లో ఆత్మహత్యాయత్నం చేశారు. దీనికి ముందు లైవ్లో ఆయన మాట్లాడారు. ‘నాకు మాట్లాడే స్వేచ్ఛ ఉందని అనుకుంటున్నాను. నేను చనిపోయినా అప్పులన్నీ తీరుస్తాను. అయితే ఈ వీడియోను వీలైనంత ఎక్కువగా షేర్ చేయమని ప్రతి ఒక్కరినీ కోరుతున్నా. నేను దేశ వ్యతిరేకిని కాదు. దేశంపై నాకు విశ్వాసం ఉంది. అయితే ప్రధాని నరేంద్ర మోదీజీకి ఒకటి చెప్పాలనుకుంటున్నాను. చిన్న వ్యాపారులు, రైతులకు మీరు శ్రేయోభిలాషి కాదు. మీ విధానాలను మార్చుకోండి’ అని రోధిస్తూ అన్నారు. తన వ్యాపారాన్ని జీఎస్టీ దెబ్బతీసిందని ఆరోపించారు.
అనంతరం రాజీవ్ తోమర్ ఏడుస్తూ ఒక ప్యాకెట్ తెరిచారు. అందులోని విష పదార్థాలను నోట్లో వేసుకున్నారు. అయితే ఆయన చర్యను అడ్డుకునేందుకు 38 ఏండ్ల భార్య పూనం ప్రయత్నించింది. భర్త ఆత్మహత్యాయత్నాన్ని నిలువరించలేకపోవడంతో మనస్థాపంతో ఆమె కూడా విషం సేవించింది.
కాగా, ఫేస్బుక్ లైవ్ చూసిన కొందరు వెంటనే పోలీసులను అప్రమత్తం చేశారు. దీంతో పోలీసులు రాజీవ్ ఇంటికి చేరుకున్నారు. విషం తీసుకున్న భార్యాభర్తలను ఆసుపత్రికి తరలించారు. అయితే భార్య పూనం మరణించింది. రాజీవ్ తోమర్ పరిస్థితి విషమంగా ఉన్నది. ఆత్మహత్యాయత్నానికి ఒక రోజు ముందు తన ఇద్దరు కుమారులతో కలిసి దిగిన ఫొటోను ఫేస్బుక్లో ఆయన పోస్ట్ చేశారు.
మరోవైపు రాజీవ్ తోమర్ బీజేపీకి మద్దతుగా ఫేస్బుక్లో పోస్టులు పెట్టేవారు. కొందరు బీజేపీ నేతలతో దిగిన ఫొటోలు కూడా గతంలో పోస్ట్ చేశారు. బీజేపీ అధికారంలో ఉన్న యూపీలో అసెంబ్లీ ఎన్నికల ముందు ఆయన ఫేస్బుక్ లైవ్లో ఆత్మహత్యాయత్నం చేయడం, భార్య సూసైడ్ చేసుకోవడం స్థానికంగా కలకలం రేపింది. ఈ వీడియో వైరల్ అయ్యింది.
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఈ ఘటనపై ఆవేదన వ్యక్తం చేశారు. మరణించిన వ్యాపారి భార్యకు సంతాపం తెలిపారు. రాజీవ్ తోమర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ట్వీట్ చేశారు. లాక్డౌన్, జీఎస్టీ వంటివి చిరు వ్యాపారులను బాగా దెబ్బతీశాయని అన్నారు. బుధవారం కాంగ్రెస్ మ్యానిఫెస్టో విడుదల సందర్భంగా ఈ ఘటనను ఆమె ప్రస్తావించారు.