న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ భారతదేశానికి రాజు కాదని బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ సుబ్రమణ్య స్వామి వ్యాఖ్యానించారు. ప్రధానమంత్రి ఆర్థిక, విదేశీ విధానాలకు తాను వ్యతిరేకమని చెప్పారు. నచ్చిన మంత్రి పదవిని స్వామికి ఇవ్వకపోవడంతో ఆయన మోదీపై గుర్రుగా ఉన్నారని ట్విట్టర్ యూజర్ చేసిన వాదనకు ఆయన ఈ మేరకు సమాధానమిచ్చారు. వాస్తవానికి తాను మరో కారణం వల్ల మోదీకి వ్యతిరేకమని పేర్కొన్నారు. ‘మోదీ ఆర్థిక, విదేశాంగ విధానాన్ని నేను వ్యతిరేకిస్తున్నాను. బాధ్యత వహించే ఎవరితోనైనా దానిపై చర్చించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. భాగస్వామ్య ప్రజాస్వామ్యం గురించి మీరు విన్నారా? మోదీ భారతదేశ రాజు కాదు’ అని స్వామి శనివారం ట్వీట్ చేశారు.
I am anti Modi policies for the economy & foreign policy and I am ready to debate with any responsible on it. Have you heard about participatory democracy? Modi is not King of India
— Subramanian Swamy (@Swamy39) August 14, 2021
అలాగే కేంద్ర విదేశాంగ మంత్రి జై శంకర్ సామర్థ్యాన్ని స్వామి ప్రశ్నించారు. విదేశాంగ మంత్రి జై శంకర్, జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ దోవల్ తీసుకున్న నిర్ణయాలతో అంతర్జాతీయంగా భారత ప్రతిష్ఠ దిగజారిందని విమర్శించారు. ‘బ్యూరోక్రాట్ ద్వయం జైశంకర్, దోవల్ అంతర్జాతీయంగా భారతదేశాన్ని దిగజార్చినందుకు ఎప్పుడైనా జాతికి క్షమాపణలు చెబుతారా? తోటి స్థాయి రాజకీయ నాయకులను గాక, కొందరు రాజకీయ నేతలనే మోదీ విశ్వసించి వారికి స్వేచ్ఛ ఇచ్చారు. ఇప్పుడు మన పొరుగు దేశాలతో మనం గందరగోళంలో ఉన్నాం’ అని మరో ట్వీట్ చేశారు.
Will the bureaucrat duo Jaishankar and Doval ever apologise to the nation for the mess they have landed India in the international scene? They were given a free hand because Modi trusts politicians not peer level politicians. Now we in a mess with all our neighbours.
— Subramanian Swamy (@Swamy39) August 14, 2021
కాగా, గతంలో రెండు సార్లు కేంద్ర కేబినెట్ మంత్రిగా ఉన్న సుబ్రమణ్య స్వామి మరోసారి కేంద్ర మంత్రి పదవిని ఆశించినప్పటికీ దక్కలేదు. ఈ నేపథ్యంలో ఆయన తరచుగా ప్రధాని మోదీపై మండిపడుతున్నారు.