న్యూఢిల్లీ, ఏప్రిల్ 11: గత 9 ఏండ్లలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేపట్టిన మౌలిక వసతుల కల్పన వల్ల తెలంగాణ ప్రభుత్వం కూడా గొప్పగా లాభపడిందని గత శనివారం హైదరాబాద్కు వచ్చిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ పరేడ్గ్రౌండ్ సభలో సెలవిచ్చారు. తాము అధికారంలోకి వచ్చాకే దేశంలో రోడ్లు వచ్చాయి, రైళ్లు వచ్చాయి అన్నంతగా డబ్బా కొట్టుకొన్నారు. కానీ, ఆయన ప్రభుత్వమే విడుదల చేసిన నివేదిక మౌలిక వసతుల కల్పన ప్రాజెక్టుల దుస్థితిని ప్రజలముందు ఉంచింది.
దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన మౌలిక వసతుల ప్రాజెక్టుల్లో ఏకంగా 717 ప్రాజెక్టులు నత్తతో పోటీపడి నడుస్తున్నాయని ఫిబ్రవరిలో విడుదలైన ఫ్లాష్ రిపోర్టు స్పష్టంచేసింది. ఇందులో రోడ్లు, జాతీయ రహదారుల ప్రాజెక్టులు 407, రైల్వే ప్రాజెక్టులు 114, పెట్రోలియం పరిశ్రమకు సంబంధించినవి 86 ప్రాజెక్టులు ఎప్పుడు పూర్తవుతాయో కూడా తెలియని పరిస్థితి ఉన్నదని రిపోర్టును బట్టి తెలుస్తున్నది. కనీసం రూ.150 కోట్ల అంచనా వ్యయానికి మించిన 1,418 ప్రాజెక్టుల పనులను ఈ పరిశీలించి ఈ నివేదికను రూపొందించారు. వీటిలో సగానికి పైగా అంటే 717 ప్రాజెక్టుల పనులు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టుగా ఉన్నాయని తేలింది.
వ్యయం తడిసి మోపెడు
పనులు ఎక్కడివక్కడే ఆగిపోవటంతో వాటి అంచనా వ్యయం అమాంతం పెరిగిపోయి తడిసి మోపెడవుతున్నది. మౌలిక వసతుల ప్రాజెక్టులను ప్రారంభించినప్పుడు మొత్తం అంచనా వ్యయం రూ.3.97 లక్షల కోట్లుగా అంచనా వేయగా, ప్రస్తుతం అది రూ.4.14 లక్షల కోట్లకు పెరిగిందని నివేదికలో తెలిపారు. అంటే పనుల ఆలస్యం వల్ల అంచనా వ్యయం 4.3 శాతం పెరిగింది. మరీ దరిద్రం ఏమంటే రైల్వేశాఖ చేపట్టిన మొత్తం 173 ప్రాజెక్టుల్లో ఏకంగా 114 ప్రాజెక్టుల పనులు ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనక్కి అన్నట్టుగా సాగుతున్నాయి. దీంతో వీటి అంచనా వ్యయం ఏకంగా 68.1 శాతం పెరగటం గమనార్హం. 173 ప్రాజెక్టులను చేపట్టినప్పుడు వాటి మొత్తం అంచనా వ్యయం రూ.3.72 లక్షల కోట్లుగా అంచనా వేశారు.
ప్రస్తుతం వాటి అంచనా వ్యయం రూ.6.26 లక్షల కోట్లకు పెరిగిందని నివేదికలో తేల్చారు. ఇక పెట్రోలియం శాఖ రూ.3.67 లక్షల కోట్లతో 146 ప్రాజెక్టులు చేపట్టింది. వీటి ప్రస్తుత అంచనా వ్యయం 4.8 శాతం పెరిగి రూ.3.85 లక్షల కోట్లకు చేరింది. ఈ మొత్తం ప్రాజెక్టుల్లో 86 పనులు ముక్కుతూ మూలుగుతూ సాగుతున్నాయి.