న్యూఢిల్లీ, సెప్టెంబర్ 17: అది జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థ (ఎన్ఎండీసీ) ఆధ్వర్యంలోని స్టీల్ ప్లాంట్. దాని విలువ రూ.24 వేల కోట్లు. ఇంకా ప్రారంభం కూడా కాలేదు. అప్పుడే మోదీ సర్కారు కన్ను దీనిపై పడింది. పురిటిలోనే ఈ స్టీల్ ప్లాంట్ గొంతు పిసికేందుకు సిద్ధమవుతున్నది. అంతేకాదు.. లక్షల మంది ఆదివాసీల కడుపు కొట్టబోతున్నది. అవును! నగర్నార్ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటుపరం చేయటానికి రెడీ అవుతున్న కేంద్రం.. ఆదివాసీలు ఇచ్చిన భూమిని కూడా కార్పొరేట్లకు కట్టబెట్టాలని చూస్తున్నది. ఛత్తీస్గఢ్-ఒడిశా సరిహద్దుకు 6 కిలోమీటర్ల దూరంలో బస్తర్ జిల్లాలో ఉన్న ఈ స్టీల్ ప్లాంట్ ఉన్నది. ఈ కర్మాగారం కోసం 1,980 ఎకరాల భూమిని సేకరించారు. సర్కారు కర్మాగారం కదా! అని అక్కడి గిరిజనులు భూమిని ప్రభుత్వానికి అప్పగించారు. కానీ, కేంద్రంలోని బీజేపీ సర్కారు ఈ ఉక్కు కర్మాగారాన్ని అమ్మేందుకు వచ్చే ఏడాది మార్చి చివరిలోగా కేంద్రం ప్రాథమిక బిడ్లను ఆహ్వానించబోతున్నది. దానికోసం ఎన్ఎండీసీ నుంచి ఈ స్టీల్ ప్లాంట్ను విభజించి, పూర్తి వాటాను అమ్మేందుకు 2020లోనే కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
ఛత్తీస్గఢ్లోని బస్తర్ ప్రాంతం పంచాయతీల (షెడ్యూల్డ్ ప్రాంతాలకు పొడిగింపు) చట్టం-1996 (పెసా చట్టం)కు లోబడి ఉన్నది. ఈ చట్టం ప్రకారం.. ఇక్కడి భూమిని సేకరించాలంటే గ్రామసభల ద్వారానే జరగాలి. ‘ప్రాజెక్టు వల్ల స్థానిక తెగలు ఇబ్బంది పడతాయని ఎలాగూ పట్టించుకోలేదు. దాన్ని అమ్మేముందైనా ప్రజల అభిప్రాయం తీసుకోవాలి. గ్రామసభల ద్వారా నిర్ణయం తీసుకొని స్టీల్ ప్లాంట్ అమ్మకంపై ముందడుగు వేయాలి. కానీ కేంద్రం అలా చేయలేదు. ప్లాంట్ను ప్రైవేట్పరం చేస్తే.. గిరిజనుల సామాజిక, సాంస్కృతిక పద్ధతులపై ప్రభావం పడుతుందా? అని కూడా కేంద్రం ఆలోచించలేదు. ఇది కచ్చితంగా పెసా చట్టాన్ని ఉల్లంఘించటమే’ అని గిరిజనుల హక్కుల కార్యకర్తలు పేర్కొంటున్నారు.
నగర్నార్ ప్లాంట్ కోసం భూ సేకరణ చట్టం-1894 ప్రకారం భూమిని సేకరించారు. ఈ భూమిని కచ్చితంగా ప్రజా ప్రయోజనాలకే ఉపయోగించాలి. ఈ భూమి మొత్తం ప్రభుత్వ నియంత్రణలోనే ఉంటుంది. అంటే.. ఏ ప్రైవేట్ కంపెనీకి కూడా ఈ భూమిని బదిలీ చేయరాదు. ఒకవేళ నాగర్నార్ యూనిట్ను అమ్మితే.. అక్కడున్న భూమి రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చేయాలి. అంటే.. ఆ భూమి హక్కుదారులుగా ఉన్న షెడ్యూల్డ్ తెగలకే చెందుతుంది. అందుల్ల కేంద్రం నిర్ణయం చట్టవ్యతిరేకం అవుతుందని రిటైర్డ్ ఐఏఎస్ ఈఏఎస్ శర్మ పేర్కొన్నారు.
గ్రామ సభల ద్వారా షెడ్యూల్డ్ ప్రాంతాల్లో గిరిజనులు స్వయం పాలన చేసుకోవటానికి వీలుగా 1996లో భారత ప్రభుత్వం పెసా చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, గుజరాత్, హిమాచల్ప్రదేశ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్లోని షెడ్యూల్డ్ ప్రాంతాలకు వర్తిస్తుంది. గ్రామస్థాయిలో పంచాయతీ చేపట్టే సామాజిక, ఆర్థిక అభివృద్ధి పథకాల అమలుకు గ్రామసభ నుంచి కచ్చితంగా అనుమతి పొందాలి. ఈ ప్రాంతాల్లోని గిరిజనుల భూములు అన్యాక్రాంతం కాకుండా నిరోధించే అధికారం గ్రామ సభకు ఉంటుంది. అంతేకాదు.. ఆదివాసీ ప్రజల ఆచార సంప్రదాయాలను పరిరక్షించే అధికారం ఉంటుంది.