న్యూఢిల్లీ, జనవరి 23: కేంద్ర బడ్జెట్లో వ్యవసాయం, రైతుల సంక్షేమానికి కేటాయించిన రూ.1,05,543 కోట్లను మోదీ సర్కార్ వెనక్కి తీసుకోవటంపై సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం) ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశ రైతాంగాన్ని మోదీ సర్కార్ దగా చేస్తున్నదని, కేంద్రంలో అధికార బీజేపీకి రైతులు తగిన విధంగా బుద్ధి చెప్పాలని ఎస్కేఎం పిలుపునిచ్చింది.
ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. కేంద్ర వ్యవసాయ శాఖ ఇటీవల విడుదల చేసిన గణాంకాల ప్రకారం, 2018-19లో వ్యవసాయానికి కేటాయించిన మొత్తం బడ్జెట్ నిధులు రూ.54,000 కోట్లుకాగా, ఇందులో రూ.21,043 కోట్లు సరెండర్ అయ్యాయి. అలా వరుసగా ఐదేండ్లలో రూ.లక్ష కోట్లకుపైగా వ్యవసాయ నిధుల్ని కేంద్రం వెనక్కి తీసుకుంది.
‘దేశ రైతాంగాన్ని రుణ బాధల నుంచి విముక్తి చేస్తామని 2014 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ రైతులకు వాగ్దానం చేసింది. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత, దేశంలోని బడా కార్పొరేట్ కంపెనీల రూ.14.56 లక్షల కోట్ల రుణాల్ని మోదీ సర్కార్ రైటాఫ్ చేసింది. రైతు రుణంలో ఒక్క రూపాయి కూడా మాఫీ కాలేదు’ అని ఎస్కేఎం పేర్కొన్నది. ఎన్సీఆర్బీ గణాంకాల ప్రకారం, 2014-22 మధ్య 1,00,474 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని గుర్తు చేసింది.