Mobile charger | మొబైల్ చార్జర్ ఓ కానిస్టేబుల్ ప్రాణం తీసింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని ఎటా జిల్లాలో చోటు చేసుకున్నది. సైనికుడు తన బ్యారక్లోని బోర్డు నుంచి మొబైల్ చార్జర్ తీసున్న క్రమంలో ఒక్కసారిగా విద్యుత్ షాక్ తగిలింది. అక్కడే ఉన్న తోటి పోలీసులు విద్యుత్ను నిలిపివేశారు. ఆ తర్వాత చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉండడంతో ఆగ్రాకు రిఫర్ చేశారు. అక్కడికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు.
వివరాల్లోకి వెళితే.. ఉస్రాహార్ జిల్లా ఇటావాలోని నాగ్లా లాల్మాన్ పోలీస్ స్టేషన్లో నివాసం ఉంటున్న రామ్జీవన్ సింగ్ కుమారుడు కానిస్టేబుల్ దల్వీర్ సింగ్ యాదవ్. దాదాపు ఏడాదిగా అవగర్ పోలీస్ స్టేషన్ కొత్వాలిలో విధులు నిర్వహిస్తున్నాడు. ఉదయం 10 గంటల సమయంలో బారిక్లోని మొబైల్ ఛార్జర్ను తీస్తుండగా విద్యుదాఘాతానికి గురయ్యాడు. అక్కడే ఉన్న ఇతర కానిస్టేబుళ్లు దల్వీర్ను ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చేర్పించారు. పీహెచ్సీలో ప్రథమ చికిత్స చేసిన తర్వాత, అతని పరిస్థితి విషమంగా ఉండడంతో ఆగ్రాకు రిఫర్ చేశారు.
మరింత పరిస్థితి విషమంగా ఉండడంతో ఎత్మాద్పూర్లోని ఎఫ్హెచ్ మెడికల్ కాలేజీకి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లుగా వైద్యులు ప్రకటించారు. వర్షం కారణంగా విద్యుత్ బోర్డు ఏర్పాటు చేసిన గోడ బాగా తడిసిపోయిందని, మొబైల్ చార్జర్ తీస్తున్న సమయంలో విద్యుత్ సరఫరా జరిగిందని అధికారులు పేర్కొన్నారు. అదే బ్యారక్లో దల్వీర్ సింగ్, నలుగురు కానిస్టేబుళ్లు, ఓ సబ్ ఇన్స్పెక్టర్ ఉంటున్నారు. ఇదిలా ఉండగా.. దల్వీందర్ సింగ్ 2005లో పోలీసుశాఖలో చేరాడు.