ప్రస్తుతం చాలా విద్యాసంస్థలు ఆన్లైన్ క్లాసులు అందిస్తున్నాయి. వీటిని వినడం కోసమే కొత్త మొబైల్స్, ఇంటర్నెట్ కనెక్షన్లు కొనుగోలు చేసిన వాళ్లు కూడా ఉన్నారు. ఇలాగే మధ్యప్రదేశ్లోని సాత్నాలో ఒక కుటుంబం కూడా మొబైల్ కొనుగోలు చేసి తమ పిల్లాడికి ఇచ్చింది. అతను 8వ తరగతి చదువుతున్నాడు. 15 ఏళ్ల ఆ బాలుడి పేరు రామ్ప్రకాష్ భదారియా. ప్రతిరోజూ చేస్తున్నట్లే మొబైల్లో ఆన్లైన్ క్లాసులు వింటున్నాడు.
ఇంట్లో మిగతా కుటుంబ సభ్యులు పని మీద బయటకు వెళ్లారు. ఆ సమయంలో రామ్ప్రకాష్ మొబైల్ పేలిపోయింది. దీంతో అతని దవడ, మొఖం గాయపడింది. మొబైల్ పేలినప్పుడు వచ్చిన భారీ శబ్దానికి చుట్టుపక్కల వాళ్లు భయపడ్డారు. వెంటనే ఆ ఇంటికి వచ్చి ఏం జరిగిందో చూసి, గాయపడిన రామ్ప్రకాష్ను ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత రామ్ప్రకాష్ తల్లిదండ్రులకు సమాచారం అందించారు.