MLC Kavitha | న్యూఢిల్లీ : దేశ ప్రగతిలో మహిళల భాగస్వామ్యం పెరగాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆకాంక్షించారు. మహిళా బిల్లుపై బీజేపీ తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని సూచించారు. మహిళా బిల్లు గురించి కాంగ్రెస్ పార్టీ ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. పెంచబోయే పార్లమెంటు సీట్లలో మహిళలకు రిజర్వేషన్ కల్పించాలని, ఇదే తమ నాయకుడు సీఎం కేసీఆర్ విధానమని స్పష్టం చేశారు. జాతీయ స్థాయి జర్నలిస్టు నిధి శర్మ రాసిన షి ద లీడర్ విమెన్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్ అనే పుస్తకావిష్కరణ సభలో కవిత పాల్గొని మాట్లాడారు.
మహిళలకు ప్రాతినిధ్యం కల్పించడంలో అన్ని ఇండ్లలో ఏం జరుగుతుందో రాజకీయ పార్టీల్లో కూడా అదే జరుగుతుందని కవిత తెలిపారు. మహిళలకు తగిన ప్రాతినిధ్యం ఉండాలన్న తప్పనిసరి నిబంధన లేనంత వరకు పార్టీల్లో అదే పరిస్థితి కొనసాగుతుందన్నారు. జనాభాలో సగభాగం ఉన్న మహిళలకు 50 శాతం కాకుండా 33 శాతం రిజర్వేషన్ ఎందుకన్న చర్చ కూడా జరుగుతోందని, ఎక్కడో ఒక చోట అడుగుముందుకు పడాలని ఆమె అన్నారు.
అత్యధిక మెజారిటీ ఉన్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మహిళా బిల్లును ఆమోదించాలనుకుంటే ఒక్క నిమిషం చాలు అని, కేంద్రం ఆ రకంగా ఆలోచించడం లేదన్నారు. ఐపీసీ, సీఆర్పీసీ, ఎవిడెన్స్ చట్టాల పేర్లను మార్చి కొత్త చట్టాలు తీసుకురావడానికి మూడు బిల్లులను తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వం మహిళా బిల్లు ఎందుకు తీసుకురావడం లేదని ప్రశ్నించారు. పెంచబోయే పార్లమెంటు సీట్లల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించాలని తెలిపారు.
కార్పొరేట్ రంగంలో మహిళలకు బోర్డు రూముల్లో మహిళల ప్రాతినిధ్యం స్వల్పంగా ఉందని, వివక్ష కొనసాగుతూనే ఉందని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు ప్రారంభిస్తున్న దాదాపు 80 శాతం స్టార్టప్ సంస్థలకు బ్యాంకుల మద్ధతివ్వడం లేదని, బ్యాంకులు సహకరిస్తున్న వాటికి సంబంధించి కూడా పురుషుల వ్యాపారాలతో పోల్చితే మహిళలు చేస్తున్న వ్యాపారానికి తక్కువ నిధులు ఇస్తున్నాయన్నారు. ఏటేటా ఉద్యోగ రంగంలో మహిళల శాతం తగ్గుతోందని, చదువుకున్న మహిళలకు ఎక్కడికి వెళ్తున్నారని ప్రశ్నించారు. దేశంలో 29 శాతం మహిళలు మాత్రమే ఉద్యోగాల్లో ఉన్నవారని, ఇలా అయితే దేశం వృద్ధి చెందలేదని, సమాజంలో మార్పురావాలి స్పష్టం చేశారు. న్యాయస్థానాల్లో ఎంత మంది మహిళా న్యాయమూర్తులు ఉన్నారని అడిగారు.
గ్రామాల్లో మహిళా సర్పంచ్లు ఇంటింటికి తిరిగి పన్నులు వసూలు చేస్తున్నారని, పన్నుల రూపంలో పంచాయతీలకు రాబడిని పెంచే ప్రయత్నం చేస్తున్నారని ప్రశంసించారు. తెలంగాణ ప్రభుత్వం మార్కెట్ కమిటీ పదవుల్లోనూ రిజర్వేషన్ కల్పించిందని చెప్పారు. భారత్లో కంపల్సరీ ఓటింగ్ రావాలని అభిప్రాయపడ్డారు. దీనిపై తీవ్రంగా ఆలోచించాలని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇలాంటి వ్యవస్థపై అధ్యయనం చేయాలని సూచన చేశారు. పట్టణాలు నగరాల్లో చదువుకున్న వారు చాలా మంది ఓటేయడానికి రాకపోవడం బాధాకరమని కవిత పేర్కొన్నారు.