Loksabha Elections 2024 : లోక్సభ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తే కులగణన చేపట్టడంతో పాటు, ఎన్నికల బాండ్ల వ్యవహారంపై దర్యాప్తు, చైనా ఆక్రమించిన భూభాగాల స్వాధీనంపై గ్యారంటీ ఇవ్వగలరా అని ప్రధాని నరేంద్ర మోదీకి తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ సవాల్ విసిరారు. సీఏఏకు చేసిన సవరణలను వెనక్కితీసుకోవాలని, ప్రకృతి వైపరీత్యాల నిధులను తక్షణమే విడుదల చేయాలని కూడా ప్రధానిని స్టాలిన్ డిమాండ్ చేశారు.
ఎన్నికల ప్రచారంలో తరచూ మోదీ గ్యారంటీ అంటూ బీజేపీ ఊదరగొడుతుండటంపై స్టాలిన్ స్పందిస్తూ ఈ ప్రశ్నలు సంధించారు. లోక్సభ ఎన్నికల నేపధ్యంలో తమిళనాడులో ప్రధాని మోదీ విస్తృత పర్యటనలపై కూడా స్టాలిన్ విస్మయం వ్యక్తం చేశారు. వలస పక్షుల మాదిరిగా ఎన్నికల సీజన్లో ప్రధాని తమిళనాడు చుట్టూ తిరుగుతున్నారని, గ్యారంటీ కార్డుతో వస్తున్న ప్రధాని మోదీ ఈ గ్యారంటీలను ఇవ్వగలరా అని ఎక్స్ వేదికగా స్టాలిన్ నిలదీశారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు, ఏటా రెండు కోట్ల మంది యువతకు ఉద్యోగాలపై కూడా ప్రధాని హామీ ఇవ్వాలని మోదీ గ్యారంటీల జాబితాలో పొందుపరచాలని స్టాలిన్ కోరారు. పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలను తగ్గించాలని, గిట్టబాటు ధరపై స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేయాలని కూడా మోదీని స్టాలిన్ డిమాండ్ చేశారు. సైన్యంలో అగ్నిపథ్ పధకాన్ని రద్దు చేయాలని కోరారు.
Read More :