Udhayanidhi Stalin | చెన్నై : తమిళనాడు యువజన సంక్షేమం, క్రీడాభివృద్ధి శాఖల మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి దారి తీస్తున్నాయి. సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని, అది మలేరియా, డెంగ్యూ, కరోనా లాంటిందని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలకు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇవ్వగా, బీజేపీ నాయకులు తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు.
తమిళనాడు ప్రొగ్రెసివ్ రైటర్స్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ శనివారం సనాతన నిర్మూలన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ఉదయనిధి స్టాలిన్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ప్రత్యేక ప్రసంగం ఇవ్వడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు నిర్వాహకులకు ధన్యవాదాలు. ఈ సమావేశానికి మీరు సనాతన వ్యతిరేక సదస్సు అని కాకుండా సనాతన నిర్మూలన సదస్సు అని పేరు పెట్టారు. అందుకు మిమ్మల్ని నేను ప్రశంసిస్తున్నాను అని ఉదయనిధి పేర్కొన్నారు. కొన్నింటిని కేవలం వ్యతిరేకించకూడదు, పూర్తిగా నిర్మూలించాలని సూచించారు. మనం డెంగ్యూను, దోమలను, మలేరియాను లేదా కరోనాను వ్యతిరేకించలేం. వాటిని నిర్మూలించాల్సిందే. అలాగే సనాతన ధర్మాన్ని కూడా నిర్మూలించాలని ఉదయనిధి చెప్పారు. సనాతన అంటే సంస్కృతం నుంచి వచ్చిందని, ఇది సాంఘిక న్యాయం, సమానత్వాలకు, మహిళా సాధికారతకు వ్యతిరేకమని ఉదయనిధి స్టాలిన్ స్పష్టం చేశారు.