కోల్కతా: తామెన్నుకున్న ప్రజాప్రతినిథులు తమకు నిత్యం అందుబాటులో ఉండాలని ప్రజలు కోరుకుంటారు. ఆపద వచ్చినప్పుడు అండగా నిలవని అనుకుంటారు. తుఫాన్లు, వరదలు వంటి ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు తమ బాధలను పంచుకోవాలని, తమను ఆదుకోవాలనుకుంటారు. అలాంటి ఆపద సమయాల్లో కూడా ఎంపీలు (MP), ఎమ్మెల్యేల (MLA) జాడ కనిపించకపోతే ఏంచేస్తారు.. పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదుచేస్తారు. మిస్సింగ్ అని పోస్టర్లు అంటించారు.. పశ్చిమబెంగాల్లోని అలీపూర్దువార్లో (Alipurduar) కూడా అదే జరిగింది.
స్థానిక బీజేపీ ఎంపీ, కేంద్ర మంత్రి అయిన జాన్ బార్లా, ఫలకటా ఎమ్మెల్యే దీపక్ బర్మన్ కనిపించడం లేదంటూ పోస్టర్లు అంటించారు. వారిద్దరిని వెతికి పెట్టాలని పోలీస్ స్టేషన్లో తృణమూల్ కాంగ్రెస్ నాయకులు మిస్సింగ్ ఫిర్యాదు ఇచ్చారు.
తుఫాన్ కారణంగా అలీపూర్దువార్లో భారీ నష్టం జరిగింది. ఇంత పెద్ద ప్రకృతి విపత్తు వచ్చినప్పటికీ స్థానిక ఎమ్మెల్యేగానీ, ఎంపీగానీ తమను పరామర్శించలేదని, కనీసం ఇటువైపు కూడా రాలేదని టీఎంసీ నేతలు ఆరోపించారు.