జైపూర్: రాజస్థాన్లో దారుణం చోటుచేసుకున్నది. రాష్ట్రంలోని ఆమేర్ (Amer) ప్రాంతంలో ఎనిమిదేండ్ల బాలికను దుండగులు గొంతుకోసి చంపారు. శనివారం మధ్యాహ్నం నుంచి కనిపించకుండా పోయిన బాలిక.. ఆదివారం ఉదయం దడాబాదీ ప్రాంతంలో శవమై తేలింది. ఎవరూ లేని ప్రాంతంలో బాలిక మృతదేహం నగ్నంగా కనిపించిందని జైపూర్ అదనపు జీసీపీ సుమన్ చౌదరి తెలిపారు.
బాలికపై అత్యాచారం చేసి చంపి ఉండొచ్చని అనుమానం వ్యక్తంచేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పంపించామని, నివేదిక వచ్చిన తర్వాత విషయాలు తెలుస్తాయని చెప్పారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫోరెన్సిక్ నిపుణులు మరిన్ని ఆధారాలు సేకరిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.