పాట్నా: ఫేస్బుక్లో పరిచయమైన బాలికను కొందరు వ్యక్తులు కిడ్నాప్ (girl kidnapped) చేశారు. ఒక ఇంట్లో నిర్బంధించి 28 రోజులపాటు సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. బీహార్లోని ముజఫర్పూర్ జిల్లాలో ఈ దారుణ సంఘటన జరిగింది. 13 ఏండ్ల బాలిక తల్లితో కలిసి ఉంటున్నది. జూలై 9న ఆరుగురు వ్యక్తులు ఆ బాలికను ఆమె ఇంటి నుంచి కిడ్నాప్ చేశారు. కుమార్తె కనిపించకపోవడంతో కూలీ పనులు చేసుకునే తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ప్రేమ వ్యవహారంగా భావించిన పోలీసులు దీని గురించి పట్టించుకోలేదు.
కాగా, ఆగస్ట్ 5న ఆ బాలికను ముజఫర్పూర్లోని ఒకచోట వదిలేసినట్లు గుర్తుతెలియని వ్యక్తి నుంచి ఆమె తల్లికి ఫోన్ వచ్చింది. దీంతో స్థానికుల సహాయంతో కుమార్తె ఆచూకీ తెలుసుకుని ఇంటికి తీసుకువచ్చింది. ఫేస్బుక్లో పరిచయమైన వ్యక్తి తన స్నేహితులతో కలిసి తనను కిడ్నాప్ చేశాడని, 28 రోజులపాటు సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారని బాధిత బాలిక చెప్పింది.
మరోవైపు బాలిక తల్లి మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై పోలీసులు స్పందించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేశారు. బాధిత బాలికను వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు. ఆమె స్టేట్మెంట్ను రికార్డు చేస్తామని పోలీస్ అధికారి తెలిపారు. దాని ఆధారంగా ఆరుగురు నిందితులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు.