న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్లోని పహల్గామ్లో ఉగ్రదాడి నేపథ్యంలో (Kashmir Terror Attack) పర్యాటకులు పెద్ద సంఖ్యలో లోయను వీడుతున్నారు. దీంతో శ్రీనగర్ ఎయిర్పోర్ట్కు ఒక్కసారిగా ప్రయాణికుల తాకిడి పెరిగింది. ఈ నేపథ్యంలో విమాన ఛార్జీలు పెరిగాయి. ఢిల్లీ, ముంబై వంటి ప్రధాన నగరాలకు సుమారు రూ.20,000 వరకు టిక్కెట్ ధరలు చేరాయి. దీంతో శ్రీనగర్ విమానాశ్రయంలో చిక్కుకున్న ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ స్పందించింది. విమాన ఛార్జీలు పెంచవద్దని ఎయిర్లైన్స్ సంస్థలను కోరింది.
కాగా, జమ్ముకశ్మీర్ నుంచి వెళ్లే పర్యాటకుల సురక్షిత ప్రయాణం కోసం తాము నిరంతరం ప్రయత్నిస్తున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. విమాన ఛార్జీల పెంపును నివారించడానికి ఎయిర్లైన్ కంపెనీలకు కఠినమైన సూచనలు జారీ చేసినట్లు చెప్పారు. ఉగ్రవాదుల దాడి తర్వాత ఆరు గంటల్లో 3,337 మంది ప్రయాణికులు శ్రీనగర్ నుంచి విమానాల్లో ప్రయాణించారని వెల్లడించారు.
మరోవైపు కశ్మీర్ను వీడేందుకు ఎయిర్పోర్ట్కు పెద్ద సంఖ్యలో తరలివస్తున్న వారికి, అక్కడ చిక్కుకున్న ప్రయాణికులకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు రామ్మోహన్ నాయుడు తెలిపారు. అదనపు విమాన సర్వీసులు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) కూడా దీనిని ధృవీకరించింది.
In the wake of the tragic terror attack, we are constantly making efforts to ensure safe travel of tourists from Srinagar. Strict instructions were given to Airline companies to avoid any fare surges, Fares are being monitored and kept at reasonable levels.
In addition to the… pic.twitter.com/jpxhvDDZl6
— Ram Mohan Naidu Kinjarapu (@RamMNK) April 23, 2025