Lucknow | యూపీలో జరుగుతున్న రాజీనామాల పరంపరపై కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ స్పందించారు. రాజీనామాలు చేసినంత మాత్రాన కొంపలేవీ మునిగిపోవని, అది పెద్ద సమస్యే కాదని వ్యాఖ్యానించారు. యూపీలో తమ పార్టీకి అన్ని దిక్కుల నుంచీ మద్దతు ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు బీజేపీనే ఆశీర్వదిస్తారని, యూపీలో కచ్చితంగా మళ్లీ అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. యూపీతో పాటు ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్లోనూ తిరిగి అధికారంలోకి వస్తామని ప్రకటించారు.
అల్వార్ అత్యాచార ఘటనపై కూడా తోమర్ స్పందించారు. ఇలాంటివి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లోనే జరుగుతాయని, ఎందుకంటే ఆ ప్రభుత్వాలు శాంతి భద్రతలపై ఏమాత్రం దృష్టిసారించవని విమర్శించారు. వారి వారి వ్యక్తిగత అంశాలపైనే దృష్టి సారిస్తే ప్రజలకు భద్రత ఉండదని తోమర్ పేర్కొన్నారు.
ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ యూపీ బీజేపీ రోజుకో దెబ్బ తగులుతూనే వుంది. ఇప్పటి వరకూ ముగ్గురు మంత్రులు, 10 మంది ఎమ్మెల్యేలు పార్టీకి గుడ్ బై చెప్పేశారు. దీంతో అధిష్ఠానం ఇబ్బందులకు గురవుతోంది. తాజాగా గురువారం ఆయుశ్ మంత్రి ధరంసింగ్ సైనీ మంత్రి పదవికి రాజీనామా చేశారు. వెనుకబడిన వర్గాలు, దళితులు, రైతులు బీజేపీ పాలనలో తీవ్ర అన్యాయానికి గురయ్యారని, అందుకే రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
వరుసగా ఒక్కొక్కరు పార్టీని వీడుతున్న నేపథ్యంలో హైకమాండ్ అలర్ట్ అయ్యింది. మిత్రపక్షాలతో ఆ ఖాళీని పూరించుకోవాలని నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్షా అప్నాదళ్, నిషాద్ పార్టీలతో పొత్తుకు ఓకే చెప్పింది. ఈ నేపథ్యంలో అప్నాదళ్ నేత అనుప్రియా పటేల్, నిషాద్ పార్టీ సంజయ్ నిషాద్తో భేటీ అయ్యారు. అప్నాదళ్ పార్టీకి 10 నుంచి 14 సీట్లు, నిషాద్కు 13 నుంచి 17 సీట్లకు అంగీకారం కుదరినట్లు తెలుస్తోంది.