లక్నో, అక్టోబర్ 3: దేశానికి అన్నంపెట్టే రైతన్న నెత్తురు చిందింది. శాంతియుతంగా నిరసనలు చేస్తున్న కర్షకుల ప్రాణాలు కేంద్రమంత్రి కాన్వాయ్ చక్రాల కింద నలిగిపోయాయి. దీంతో ఆగ్రహానికి గురైన నిరసనకారులు ప్రమాదానికి కారణమైన వాహనాలను దగ్ధం చేశారు. ఈ క్రమంలో పోలీసులు లాఠీచార్జి చేయడంతో పలువురు రైతులకు గాయాలయ్యాయి. రణరంగాన్ని తలపించిన ఈ ఘటనలో నలుగురు రైతులు సహా మొత్తం 8 మంది ప్రాణాలు కోల్పోయారు. ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖీరీ జిల్లాలో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకున్నది.
అసలేమైంది?
లఖింపూర్ ఖీరీ జిల్లా తికునియాలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా, యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య ఆదివారం హాజరయ్యారు. అనంతరం అక్కడి నుంచి అజయ్ మిశ్రా స్వగ్రామమైన బన్బీపూర్లో వీరు పర్యటించాల్సి ఉన్నది. ఈ విషయం తెలుసుకున్న రైతులు.. వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ ఆదివారం ఉదయం నుంచే తికునియా-బన్బీపూర్ మార్గంలో నల్లజెండాలతో ఆందోళన చేస్తున్నారు. అదే సమయంలో అటుగా వచ్చిన మంత్రి కాన్వాయ్ను రైతులు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. ఈక్రమంలో రైతులమీదకు మంత్రి కాన్వాయ్ దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు రైతులు మరణించగా, పదుల సంఖ్యలో గాయపడ్డారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన నిరసనకారులు ప్రమాదానికి కారణమైన కారుతో పాటు మరో రెండు కార్లలో ఉన్నవారిపై దాడిచేశారు. అనంతరం ఆ వాహనాలను దగ్ధం చేశారు. ఈ క్రమంలో పోలీసులు లాఠీచార్జి చేశారు. అనంతర ఘర్షణల్లో మరో ఇద్దరు రైతులు మరణించారు. ఉద్రిక్తతలపై లఖింపూర్ ఖీరీ ఏఎస్పీ అరుణ్ కుమార్ సింగ్ మీడియాతో మాట్లాడారు. కాన్వాయ్ ప్రమాదం, అనంతర ఘర్షణల్లో నలుగురు రైతులు మరణించినట్టు తెలిపారు. ప్రమాదానికి కారణమైన కాన్వాయ్లో ప్రయాణించిన వ్యక్తులపై కొందరు దుండగులు దాడులు చేశారని, దీంతో మరో నలుగురు మరణించినట్టు వెల్లడించారు. ఉద్రిక్తతల నేపథ్యంలో లఖింపూర్ ఖీరీలో ఇంటర్నెట్ నిలిపేశారు.
రాళ్లురువ్వడంతోనే ప్రమాదం: అజయ్ మిశ్రా
రాళ్లురువ్వడంతో కాన్వాయ్లో కారు అదుపుతప్పి బో ర్లా పడిందని కేంద్రమంత్రి అజయ్ మిశ్రా పేర్కొన్నారు. కారు కిందపడి ఇద్దరు రైతులు మరణించారని చెప్పారు. ప్రమాద సమయంలో తను, తన కుమారుడు ఘటనాస్థలిలో లేమన్నారు. రైతుల్లో చేరిన కొందరు వ్యక్తులు చేసిన దాడిలో ముగ్గురు బీజేపీ కార్యకర్తలు, డ్రైవర్ మృతిచెందినట్టు పేర్కొన్నారు. రైతులపై తన కుమారుడు కారు ఎక్కించినట్టు వస్తున్న వార్తలు అవాస్తవమని తెలిపారు.
కారు నడిపింది మంత్రి కుమారుడే..
రైతుల మీద నుంచి దూసుకెళ్లిన మంత్రి కాన్వాయ్లో కేంద్రమంత్రి అజయ్ మిశ్రా కొడుకు ఆశిష్ మిశ్రా ఉన్నాడని, ఆయనే కారును నడిపాడని బీకేయూ ఆరోపించింది. ఘటనకు బాధ్యత వహిస్తూ అజయ్ మిశ్రా పదవికి రాజీనామా చేయాలని సంయుక్త కిసాన్మోర్చా డిమాండ్ చేసింది. పోలీసులు జరిపిన కాల్పుల్లోనే మరో ఇద్దరు రైతులు మరణించినట్టు ఆరోపించింది. రైతులపై దాడిని కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీ, ఆప్, ఆర్ఎల్డీ తదితర పార్టీలు ఖండించాయి. ఘటన విషయం తెలియగానే బీకేయూ నేత రాకేశ్ టికాయిత్.. లఖింపూర్ ఖీరీకి ప్రయాణమయ్యారు.
రైతులకు తగిన బదులివ్వాలి
బీజేపీ కార్యకర్తలను రెచ్చగొడుతూ హర్యానా సీఎం ఖట్టర్ వ్యాఖ్యలు
చండీగఢ్, అక్టోబర్ 3: బీజేపీ కార్యకర్తలు బృందాలుగా ఏర్పడాలని, జైలుకైనా వెళ్లేందుకు సిద్ధపడాలని హర్యానా సీఎం మనోహర్లాల్ ఖట్టర్ పిలుపునివ్వడం వివాదాస్పమైంది. ఆదివారం హర్యానాలో జరిగిన బీజేపీ కిసాన్ మోర్చా సమావేశంలో సీఎం ఖట్టర్ మాట్లాడారు. కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న రైతు ఉద్యమాన్ని ప్రస్తావిస్తూ.. ‘మనం తగిన విధంగా బదులివ్వాలి. 500 లేదా 1000 మంది బీజేపీ కార్యకర్తలు ఒక్కో బృందంగా ఏర్పడాలి. జైలుకు వెళ్లాల్సి వస్తుంది అని బాధపడకండి. పెద్ద లీడర్లు అవుతారు. చరిత్రలో మీ పేరు నిలిచిపోతుంది’ అని అన్నారు. గుంపులో ఒకరు ‘కర్రలు చేతబూనాలి’ అనడం వినిపించింది. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఖట్టర్ వ్యాఖ్యలను కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది. రైతులపై కర్రలతో దాడికి ఖట్టర్ బీజేపీ కార్యకర్తలను ఉసిగొల్పుతున్నారని ఆరోపించింది.