లక్నో: ఉత్తరప్రదేశ్కు చెందిన బీజేపీ సీనియర్ నేత, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా బుధవారం ఓటు వేశారు. భారీగా పోలీసులు, పారామిలిటరీ సిబ్బంది ఆయనకు రక్షణగా నిలిచారు. యూపీలో నాలుగో విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్లో భాగంగా లఖింపూర్ ఖేరీలోని పోలింగ్ బూత్లో ఓటు హక్కును అజయ్ మిశ్రా వినియోగించుకున్నారు. అనంతరం ఆయన విక్టరీ సింబల్ చూపారు. కాగా, ఆయన కుమారుడు, లఖింపూర్ ఖేరీ కేసులో ప్రధాన నిందితుడైన ఆశిష్ మిశ్రా గురించి మీడియా జర్నలిస్టులు ప్రశ్నలు అడిగేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. అయితే కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా భారీ భద్రత మధ్య పోలింగ్ బూత్కు వచ్చి ఓటు వేయడంపై విమర్శలు వెల్లువెత్తాయి.
గత ఏడాది సెప్టెంబర్లో లఖింపూర్ ఖేరీలో రహదారి పక్కన నిరసన చేస్తున్న రైతులను కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా తన కాన్వాయ్లోని వాహనంతో తొక్కించాడు. ఈ ఘటనతోపాటు వెంటనే చెలరేగిన హింసాకాండలో నలుగురు రైతులు, ఒక జర్నలిస్ట్, ముగ్గురు బీజేపీ కార్యకర్తలు, వాహనం డ్రైవర్ మరణించారు. దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన ఈ కేసుపై సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంది. దీంతో దిగివచ్చిన యూపీ పోలీసులు చివరకు ప్రధాన నిందితుడైన ఆశిష్ మిశ్రాను అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో అజయ్ మిశ్రాను కేంద్ర మంత్రి పదవి నుంచి తొలగించాలని విపక్షాలు డిమాండ్ చేశాయి.
అయితే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్కు ముందు ఆశిష్ మిశ్రాకు అలహాబాద్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో ఆయన బెయిల్ను రద్దు చేయాలని కోరుతూ బాధిత రైతు కుటుంబాలతోపాటు మరో వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఉన్నతస్థాయిలో ఉన్న ఆయన సాక్షులను ప్రభావితం చేసి కేసును పక్కదారి పట్టించవచ్చని ఆరోపించారు.