న్యూఢిల్లీ, ఏప్రిల్ 25: ఆమ్ ఆద్మీ పార్టీని వీడి బీజేపీలో చేరి దేశ రాజధానిలో రాజకీయ ప్రకంపనలు సృష్టించిన రాఘవ్ చద్దా ప్రజాదరణ దెబ్బ తిన్నట్లు కనిపిస్తోంది. కొన్ని వారాల క్రితం ఆప్ రాజ్యసభ ఉపనాయకుడి పదవిని కోల్పోయిన చద్దా బీజేపీలో చేరతారని విస్తృతంగా ఊహించినప్పటికీ ఆయన తీసుకున్న ఈ నిర్ణయం జెన్జీకి నచ్చినట్లు కనిపించడం లేదు. నేటి డిజిటల్ యుగంలో ఒకరి ప్రజాదరణను అంచనా వేయడానికి సోషల్ మీడియా ఫాలోవర్లను ఒక కొలమానంగా చూస్తారు. బీజేపీలోకి అనూహ్యంగా మారిన తర్వాత చద్దా 24 గంటల్లోపే ఇన్స్టాగ్రామ్లో దాదాపు 10 లక్షల మంది ఫాలోవర్లను కోల్పోయారని గణాంకాలు చూపిస్తున్నాయి. చద్దాపై వ్యతిరేకతకు యువత ముఖ్యంగా జెన్జీనే కారణమని రాజకీయ విశ్లేషకులు సూచించారు. డేటా ఆధారిత రాజకీయ నాయకుడైన చద్దా ఆ డేటాను విశ్లేషించి పరిస్థితిని చక్కదిద్దుకోగలరా? అనే ప్రశ్నకు కాలమే సమాధానం చెప్పాలి!
కేజ్రీవాల్ విధానాల కారణంగానే ఆమ్ ఆద్మీ పార్టీని వీడాల్సి వచ్చిందని ఎంపీ రాఘవ చద్దా పేర్కొన్నారు. మరో ఆరుగురు ఎంపీలు కూడా ఇదే కారణంతో పార్టీని వీడినట్టు స్పష్టం చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. శీష్ మహల్ కారణంగా ఆప్ ప్రతిష్ట దెబ్బ తిందని పేర్కొన్నారు. దీంతోనే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘోర పరాభవం మూటగట్టుకుందని తెలిపారు.
కేజ్రీవాల్ వెళ్లిపోయిన కొన్ని గంటలకే అశోక్ మిట్టల్ ఫిరాయింపు ఒకప్పుడు ఆప్ అధినేత కేజ్రీవాల్కు విధేయత చూపిన నాయకులే ఇప్పుడు ఆయనకు వ్యతిరేకులతో చేతులు కలిపారు. దీంతో బీజేపీకి ప్రత్యామ్నాయం అవుతుందనుకున్న ఆమ్ ఆద్మీ పార్టీకి బీటలు వారుతున్నాయి. ఢిల్లీ మద్యం కేసు కారణంగా కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా చేసినప్పుడు ఆయనను తన నివాసంలో ఉండమని ఆప్ ఎంపీ అశోక్ మిట్టల్ ఆహ్వానించారు. కేంద్రం కేజ్రీవాల్కు ఢిల్లీలోని లోధి ఎస్టేట్లో టైప్-7 ప్రభుత్వ బంగ్లాలో కేటాయించడంతో శుక్రవారం ఆయన అందులోకి మారారు. కాగా, కేజ్రీవాల్ తన నివాసాన్ని వీడిన కొద్ది అశోక్ మిట్టల్ ఆమ్ ఆద్మీ పార్టీని వీడి బీజేపీలోకి వెళుతున్నట్టు ప్రకటించారు.