చెన్నై: రైలులో ప్రయాణిస్తున్న వలస కార్మికులను తమిళా?, హిందీనా? అని ఒక వ్యక్తి అడిగాడు. స్థానికుల ఉద్యోగాలు కొల్లగొడుతున్నారంటూ వారిని కొట్టాడు. హిందీని తీవ్రంగా వ్యతిరేకించే తమిళనాడులో ఈ సంఘటన జరిగింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఒక రైలులోని జనరల్ బోగి ప్రయాణికులతో కిక్కిరిసి ఉంది. అందులో కొందరు వలస కార్మికులు కూడా ఉన్నారు. అయితే వారు ఏ రాష్ట్రానికి చెందిన వారంటూ తమిళనాడుకు చెందిన ఒక వ్యక్తి అడిగాడు. తమిళా, హిందీనా అని ప్రశ్నించాడు. హిందీ రాష్ట్రానికి చెందినట్లుగా ఆ వలస కార్మికులు చెప్పారు. దీంతో ఆ వ్యక్తి వారిని కొట్టాడు. తమిళులకు దక్కాల్సిన ఉద్యోగాలను వారు కొల్లగొడుతున్నారని ఆరోపిస్తూ తిట్టాడు. తోటి ప్రయాణికుల మాటలు లెక్కచేయని ఆ వ్యక్తి పలుమార్లు ఆ వలస కార్మికులను కొట్టాడు.
కాగా, ఆ రైలులో ప్రయాణించిన ఒక వ్యక్తి తన మొబైల్ ఫోన్లో దీనిని రికార్డ్ చేశాడు. దీంతో ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ వీడియో క్లిప్ రైల్వే పోలీసుల దృష్టికి వెళ్లింది. ఈ నేపథ్యంలో ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు. వలస కార్మికులను కొట్టిన వ్యక్తిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని, అతడి కోసం వెతుకుతున్నట్లు చెప్పారు. ఇలాంటి సంఘటనలను సహించబోమంటూ ఒక ప్రకటనలో హెచ్చరించారు.
Video: Migrant Workers Beaten Up On Train In Tamil Nadu https://t.co/9T0GbjvKmO pic.twitter.com/ixsNfcOjnt
— NDTV (@ndtv) February 17, 2023