తిరువనంతపురం: ఒక వలస కార్మికుడు లాటరీ (Kerala Lottery) లో రూ.75 లక్షలు గెలిచాడు. అయితే ఆ లాటరీ టికెట్ను ఎవరైనా లాగేసుకుంటారన్న భయంతో పోలీస్ స్టేషన్ను ఆశ్రయించాడు. లాటరీ టికెట్ను బ్యాంకులో డిపాజిట్ చేసేందుకు పోలీస్ రక్షణ కోరాడు. ఆ కార్మికుడి భయాన్ని అర్థం చేసుకున్న పోలీసులు సానుకూలంగా స్పందించారు. పశ్చిమ బెంగాల్కు చెందిన వలస కార్మికుడు అశోక్ కొన్ని నెలల కిందట కేరళ వచ్చాడు. మలప్పురం జిల్లాలోని పెరింతల్మన్న ప్రాంతంలో ఇతర కార్మికులతో కలిసి ఒక ఇంట్లో నివసిస్తున్నాడు. కొన్ని నెలల కిందట కేరళ ప్రభుత్వానికి చెందిన విన్-విన్ లాటరీ టికెట్ కొనుగోలు చేశాడు. మొదటి బహుమతిగా రూ.75 లక్షలు గెలుచుకున్నాడు.
కాగా, వలస కార్మికుడు అశోక్లో లాటరీ గెలిచిన ఆనందం ఏ మాత్రం కనిపించలేదు. పైగా గెలిచిన లాటరీ టికెట్ ఎవరైనా చోరీ చేస్తారేమోనని, లాక్కుంటారేమోనన్న భయాందోళన ఎక్కువైంది. ఈ నేపథ్యంలో ఇద్దరు మలయాళీ మిత్రులతో కలిసి స్థానిక పోలీస్ స్టేషన్కు అశోక్ వెళ్లాడు. తన పరిస్థితిని పోలీసులకు వివరించాడు.
మరోవైపు అశోక్ ఆందోళన అర్థం చేసుకున్న పోలీస్ అధికారి సానుకూలంగా స్పందించారు. గెలిచిన లాటరీ టికెట్ను బ్యాంకులో సురక్షితంగా సమర్పించేందుకు సీనియర్ సీపీఓతో సహా పోలీసు సిబ్బందిని అశోక్ వెంట పంపారు. దీంతో పోలీసు రక్షణతో బ్యాంకుకు వెళ్లిన అతడు గెలిచిన లాటరీ టికెట్ను సమర్పించాడు. ఆ తర్వాత లాటరీ టికెట్ గెలిచిన ఆనందం పొందాడు. బెంగాల్లోని తన స్వగ్రామానికి తిరిగి వెళ్లాలని అతడు నిర్ణయించుకున్నాడు.