బెంగళూరు, ఆగస్టు 18: బీజేపీ పాలిత రాష్ట్రమైన కర్ణాటకలో జీతాల్లేక మధ్యాహ్న భోజనం సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మూడు నెలలు జీతాల్లేక అల్లాడిపోతున్నారు. వచ్చేదే అరకొర జీతాలు.. అవి కూడా సమయానికి అందక కష్టాలు పడాల్సి వస్తున్నదని వాపోతున్నారు. దీంతో గత్యంతరం లేక రోడ్డెక్కారు. రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది వర్కర్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనకు దిగారు. దాదాపు 6500 మంది వర్కర్లకు ఎలాంటి నష్టపరిహారం కానీ, రిటైర్మెంట్ బెనెఫిట్స్ కానీ లేదని వాపోతున్నారు. మూడు నెలలుగా జీతాల్లేకుండానే పనిచేస్తున్నామని సీఐటీయూ ప్రెసిడెంట్ వరలక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. గత బడ్జెట్లో రూ.వెయ్యి పెంచుతామని ప్రకటించినా ఇప్పటివరకు ఆ పెంపు అమల్లోకి రాలేదని చెప్పారు.