Omicron Effect : కరోనా తాజా వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తితో పాటు కొవిడ్-19 పాజిటివిటీ రేటు ఎగబాకుతుండటంతో ఢిల్లీ ప్రభుత్వం ఎల్లో అలర్ట్ జారీ చేయగా ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్సీ) మెట్రో రైళ్లపై పలు నియంత్రణలు ప్రకటించింది.
కొవిడ్-19 మార్గదర్శకాలకు అనుగుణంగా మెట్రో రైళ్లలో 50 శాతం సీటింగ్ సామర్ధ్యాన్నే అనుమతిస్తామని, రైళ్లలో నిలుచుని ప్రయాణించడం అనుమతించబోమని అధికారిక ప్రకటనలో డీఎంఆర్సీ స్పష్టం చేసింది. మార్గదర్శకాలు, కొవిడ్-19 నిబంధనలకు అనుగుణంగా మెట్రో స్టేషన్లలో పరిమితంగానే ఎంట్రీ గేట్లను తెరిచి రాకపోకలను నియంత్రిస్తామని పేర్కొంది.
మెట్రో స్టేషన్లలో 712 గేట్లకు గాను ఇకనుంచీ 444 గేట్లను మాత్రమే తెరుస్తారు. ఇక అంతకుముందు ఢిల్లీలో కొవిడ్-19 పరిస్ధితిని సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఉన్నతాధికారులతో సమీక్షించారు. వరుసగా రెండు రోజులు పాజిటివిటీ రేటు 0.5 శాతం పైగా నమోదవడంతో దశలవారీ యాక్షన్ ప్లాన్ అమలు చేసేలా ఎల్లో అలర్ట్ను జారీ చేస్తున్నామని కేజ్రీవాల్ ప్రకటించారు.
ఎల్లో అలర్ట్లో భాగంగా సినిమా థియేటర్లు, మల్లీప్లెక్స్లు, జిమ్లు, యోగా ఇనిస్టిట్యూట్లు, బ్యూటీ పార్లర్లు మూతపడగా రెస్టారెంట్లను 50 శాతం సీటింగ్ కెపాసిటీతో అనుమతిస్తారు. పలు నియంత్రణలకు లోబడి ఇతర వాణిజ్య సంస్ధలను అనుమతిస్తారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకూ నైట్ కర్ఫ్యూ అమలవుతుంది.