షిల్లాంగ్: మేఘాలయలోని ఈస్ట్ ఖాసీ హిల్స్లోగల సోహియాంగ్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీ అయిన యునైటెడ్ డెమోక్రటిక్ పార్టీ (UDP) విజయం సాధించి.. ఆ రాష్ట్రంలో సంకీర్ణ సర్కారుకు నేతృత్వం వహిస్తున్న నేషనల్ పీపుల్స్ పార్టీ (NPP) కి షాక్ ఇచ్చింది. యూడీపీ అభ్యర్థి షిన్షార్ లింగ్డో తబాహ్ చేతిలో ఎన్పీపీ అభ్యర్థి సామ్లింగ్ మాల్న్జియాంగ్ 3,400 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు.
షిన్షార్ తబాహ్కు మొత్తం 16,679 (51 శాతం) ఓట్లు పోలవగా, మాల్న్జియాంగ్కు 13,176 (41.22 శాతం) ఓట్లు వచ్చాయి. ఈ స్థానం నుంచి మొత్తం ఆరుగురు అభ్యర్థులు బరిలో నిలువగా.. బీజేపీ అభ్యర్థి సెరాప్త్ ఎరిక్ ఖర్బుకీకి కేవలం 40 (0.12 శాతం) ఓట్లు మాత్రమే పోలయ్యాయి. కాగా, గత ఫిబ్రవరిలో మేఘాలయ అసెంబ్లీకి ఎన్నికలు జరుగగా.. యూడీపీ అభ్యర్థి HDR లింగ్డో మరణంతో సోహియాంగ్ ఎన్నిక వాయిదాపడింది. దాంతో ఇప్పుడు ఆ స్థానానికి ఎన్నిక నిర్వహించారు.