న్యూఢిల్లీ, జూలై 21: దేశంలో 30 ఏండ్ల గరిష్ఠానికి నిరుద్యోగం పెరిగిపోయి యువత ఒకవైపు పనులు లేక అల్లాడిపోతున్నారు. మరోవైపు కేంద్రంలోని వివిధ విభాగాల్లో లక్షల పోస్టులను నరేంద్రమోదీ ప్రభుత్వం భర్తీచేయకుండా ఖాళీగా ఉంచుతున్నది. ఇది ప్రతిపక్షాల విమర్శ కాదు.. సాక్షాత్తూ కేంద్రప్రభుత్వమే పార్లమెంటులో చెప్పిన లెక్కలు. సాధారణంగా గ్రూప్ బీ, సీ, డీ పోస్టులు ఖాళీగా ఉంటాయి. కానీ, మోదీ జమానాలో ప్రభుత్వాన్ని నడిపించే అధికారుల పోస్టులను కూడా ఖాళీగా ఉంచుతున్నారు.
కేంద్రంలోని ఉన్నత స్థాయి పోస్టులను భర్తీచేసే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గత పదేండ్లలోనే అతి తక్కువగా 2021-22లో పోస్టుల భర్తీకి కేంద్రానికి సిఫారసు చేసిందని తేలింది. 2021-22లో యూపీఎస్సీ పరిధిలో 5,153 పోస్టులు ఉండగా, 4,119 పోస్టుల భర్తీకి మాత్రమే కేంద్రానికి సిఫారసు చేసింది. లోక్సభలో గురువారం ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ సహాయ మంత్రి జితేంద్రసింగ్ లిఖితపూర్వకగా ఈ విషయాన్ని చెప్పారు. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలో 2013-14లో యూపీఎస్సీ ద్వారా 8,852 పోస్టులు భర్తీ చేయగా, 2022 వచ్చేసరికి సగానికి సగం తగ్గిపోయి 4,119కి చేరటం గమనార్హం.
కిందిస్థాయిలో 10 లక్షల పోస్టులు ఖాళీ
కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో 2021 మార్చి 1 నాటికి 9.79 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఈ విషయాన్ని కూడా జితేంద్రసింగ్ బుధవారం లోక్సభలోనే వెల్లడించారు. కేంద్రంలో మొత్తం మంజూరైన పోస్టులు 40.35 లక్షలు ఉండగా, 9.79 లక్షలు ఖాళీగా ఉన్నాయని రాతపూర్వకంగా తెలిపారు. కేంద్రం పరిధిలోని యూనివర్సిటీలు, వైద్యశాలల్లో కూడా ప్రొఫెసర్లు, వైద్యులు లేక కార్యకలాపాలు కుంటుపడుతున్నాయి. 42 సెంట్రల్ యూనివర్సిటీల్లో ఏకంగా 6,549 ప్రొఫెసర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఒక్క ఢిల్లీ యూనివర్సిటీలోనే 900 పోస్టులు ఖాళీ ఉన్నాయని కేంద్రమే తెలిపింది. ఉద్యోగ ఖాళీల భర్తీలో బీజేపీ సర్కారు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నదో ఈ లెక్కలే చెప్తున్నాయని నిరుద్యోగులు మండిపడుతున్నారు.