NEET UG : నీట్ యూజీ – 2025 కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ సోమవారం (జూలై 21) ప్రారంభమైంది. ఈ కౌన్సెలింగ్ ద్వారా దేశంలోని మెడికల్ కళాశాలల్లో ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సులలో సీట్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (MCC) ఈ మొత్తం ప్రక్రియను mcc.nic.in అనే తమ అధికారిక వెబ్సైట్లో నిర్వహిస్తోంది.
ఈ రిజిస్ట్రేషన్, ఛాయిస్ ఫిల్లింగ్ ప్రక్రియ జూలై 28 వరకు కొనసాగుతుంది. విద్యార్థులు ఈ గడువులోగా తమ దరఖాస్తులను సమర్పించి, తమకు నచ్చిన కళాశాలలు, కోర్సులను ఎంపిక చేసుకోవాలి. ఈ ఏడాది దేశవ్యాప్తంగా సుమారు 1.3 లక్షల సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో దాదాపు 1 లక్ష ఎంబీబీఎస్ సీట్లు, 28 వేల బీడీఎస్ సీట్లు ఉన్నాయి. మొత్తం 775 విద్యా సంస్థలు ఈ కౌన్సెలింగ్ ప్రక్రియలో పాల్గొంటున్నాయి.
కౌన్సెలింగ్ ప్రక్రియలో మొత్తం మూడు సాధారణ రౌండ్లు, ఒక స్ట్రే వాకెన్సీ (Stray Vacancy) రౌండ్ ఉంటాయి. ప్రతి రౌండ్లోనూ విద్యార్థులు రిజిస్ట్రేషన్, చాయిస్ ఫిల్లింగ్, సీటు కేటాయింపు, రిపోర్టింగ్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ వంటి దశలను పూర్తి చేయాల్సి ఉంటుంది. విద్యార్థులు తమ నీట్ యూజీ 2025 ర్యాంక్, సీట్ల లభ్యత, చాయిస్ ఫిల్లింగ్ ఆధారంగా సీట్లను పొందుతారు.