భోపాల్: బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో భారీ కుంభకోణం వెలుగుచూసింది. స్కూల్ పిల్లల ఆహార పథకంలో భారీగా గోల్మాల్ జరిగింది. సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ పర్యవేక్షణలో ఉన్న మహిళా, శిశు అభివృద్ధి శాఖలో భారీ ఎత్తున అవినీతి జరిగినట్లు మధ్యప్రదేశ్ అకౌంటెంట్ జనరల్ గుర్తించింది. 2018-21 వరకు ఈ శాఖలో జరిగిన భారీ స్కామ్కు సంబంధించి 36 పేజీల నివేదికను విడుదల చేసింది. పిల్లలు, మహిళల పౌష్ఠికాహారం కోసం మధ్యప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న టేక్ హోం రేషన్ (టీహెచ్ఆర్) పథకంలో భారీ ఎత్తున అవినీతి జరిగినట్లు అందులో పేర్కొంది.
ప్రభుత్వ ఆడిట్ నివేదిక ప్రకారం స్కూల్ పిల్లలకు ఉచిత ఆహార పంపిణీ పథకంలో లబ్ధిదారుల సంఖ్య, ఆహారం ఉత్పత్తి, నాణ్యత, పంపిణీలో భారీగా అవకతవకలు జరిగాయి. 2018లో కేవలం 9 వేలు ఉన్న లబ్ధిదారుల సంఖ్య 2021 నాటికి ఏకంగా 36.08 లక్షలకు పెరిగింది. ఉచిత రేషన్కు అర్హులైన స్కూల్ బాలికలను 2018 ఏప్రిల్ నాటికి గుర్తించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సూచించినా ఆ రాష్ట్ర మహిళా, పిల్లల అభివృద్ధి శాఖ (డబ్ల్యూసీడీ) పట్టించుకోలేదు. 2018-19లో అర్హులైన 11-14 ఏళ్ల బాలికల సంఖ్య 9,000గా ఆ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ అంచనా వేసింది. అయితే ఎలాంటి సర్వే నిర్వహించకుండానే లబ్ధిదారుల సంఖ్య 36.08 లక్షలుగా మహిళా, పిల్లల అభివృద్ధి శాఖ పేర్కొంది.
కాగా, 8 జిల్లాల పరిధిలోని 49 అంగన్వాడీ కేంద్రాల్లో ఆడిట్ నిర్వహించగా కేవలం మూడు జిల్లాలోనే రేషన్ పొందుతున్న స్కూల్ బాలికల నమోదును గుర్తించారు. అయితే 2018-21లో 63,748 మంది బాలికలను జాబితాలో చేర్చి 29,102 మందికి సహాయం చేసినట్లుగా డబ్ల్యూసీడీ పేర్కొంది. ఈ నేపథ్యంలో డాటా మానిప్యులేషన్ ద్వారా రూ.110.83 కోట్ల విలువైన రేషన్ పక్కదారి పట్టినట్లు ఆడిట్లో తేలింది. అలాగే రేషన్ ఉత్పత్తిలో రూ.58 కోట్ల మేర అవినీతి జరిగినట్లు వెలుగుచూసింది. రూ.62.72 కోట్ల విలువైన 10,000 మెట్రిక్ టన్నులకుపైగా రేషన్ సరుకులు అసలు రవాణా కాలేదు. గోదాముల్లో కూడా లేని ఈ సరుకులు మాయం అయినట్లు బయటపడింది.
మరోవైపు రూ.6.94 కోట్ల విలువైన 1,125.64 మెట్రిక్ టన్నుల ఉచిత ఆహారం పంపిణీ కోసం ఆరు ఉత్పత్తి సంస్థలు వినియోగించిన లారీల రిజిస్టర్ నంబర్లు నకిలీగా తేలాయి. రవాణా శాఖ రికార్డుల ప్రకారం ఆ రిజిస్టర్ నంబర్లతో బైక్లు, ఆటోలు, కార్లు, ట్యాంకర్లు ఉన్నట్లుగా గుర్తించారు. అలాగే ఆడిట్ చేసిన ఎనిమిది జిల్లాల్లో 2018-21 మధ్య అంగన్వాడీ కేంద్రాలను అధికారులు ఏ మాత్రం తనిఖీ చేయలేదు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో నాణ్యత లేని ఆహార సరుకుల పంపిణీ జరిగిందని ఆ ఆడిట్ నివేదికలో పేర్కొన్నారు.
2020 ఉప ఎన్నికల్లో ఓటమితో ఇమర్తి దేవి మంత్రి పదవికి రాజీనామా చేశారు. దీంతో నాటి నుంచి మహిళా, పిల్లల అభివృద్ధి శాఖ (డబ్ల్యూసీడీ) సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ పర్యవేక్షణలో ఉంది. దీంతో ఆయన కనుసన్నల్లోనే ఈ శాఖలో భారీగా అవినీతి జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.