శ్రీనగర్, మే 21: రాహుల్ భట్ హత్యకు నిరసనగా వందలాది మంది కశ్మీర్ పండిట్లు శనివారం జమ్ముకశ్మీర్ బీజేపీ కార్యాలయం ఎదుట బైఠాయించారు. ‘ఈ రక్తపాతం ఎప్పటిదాకా’ అని ప్రశ్నించారు. ‘మాకు న్యాయం కావాలి’ అని డిమాండ్ చేశారు. పునరావాస కార్యక్రమంలో భాగంగా ఉద్యోగాలు కల్పించిన పండిట్లందరినీ వెంటనే కశ్మీర్ నుంచి దేశంలో ఎక్కడికైనా తరలించాలని విజ్ఞప్తి చేశారు. అంతకుముందు పండిట్లు జమ్ముకశ్మీర్లోని లాల్ చౌక్ దగ్గర భారీ ధర్నా నిర్వహించారు. తమ డిమాండ్లను జమ్ముకశ్మీర్ యంత్రాంగం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. తమ ఆవేదన తెలిసొచ్చేదాకా నిరసన ప్రదర్శనలు చేస్తూనే ఉంటామని తెలిపారు.
భద్రత కల్పించడంలో కేంద్రం విఫలం
రాహుల్ భట్ హత్య జరిగి శనివారానికి 10 రోజులు. ఈ నేపథ్యంలో, లాల్చౌక్ దగ్గర ధర్నాకు ముందు కశ్మీర్ పండిట్లు మొదట లాల్ మండి ప్రాంతంలోని బండ్ దగ్గర సమావేశమయ్యారు. భట్కు సంతాప సూచకంగా జీలం నది దగ్గర ప్రత్యేకంగా పూజలు చేశారు. తర్వాత అక్కడి నుంచి లాల్ చౌక్ దగ్గరికి ర్యాలీగా వెళ్లారు. లాల్చౌక్ దగ్గర ధర్నా అనంతరం పండిట్లంతా ‘ఓం.. ఓం’ అని ఓంకార నాదం చేస్తూ రాష్ట్ర బీజేపీ కార్యాలయం దగ్గరకు ర్యాలీగా వెళ్లారు. పండిట్ల నిరసన అంతా శాంతియుతంగా జరిగింది. లాల్చౌక్తో పాటు జమ్ముకశ్మీర్లో మరికొన్ని ప్రాంతాల్లో కూడా నిరసనలు జరిగాయి. తమకు భద్రత కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని పండిట్లు ఆరోపించారు.