మీరట్: యూపీలోని మీరట్లో జరిగిన అగ్నిప్రమాదం(Fire Accident) ఘటనలో.. ఓ ఇంట్లోని ఆరుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో అయిదుగురు చిన్నారులు ఉన్నారు. షార్ట్ సర్య్యూట్ వల్ల అగ్నిప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. లిసాది గేటు ప్రాంతంలో ఉన్న ఓ ఇంట్లో ఈ ప్రమాదం జరిగింది. సోమవారం రాత్రి 8 గంటలకు కిద్వాయి నగర్లో ఉన్న ఇంటి నుంచి మంటలు వ్యాపించాయని, కాలిన గాయాలతో ఉన్న ఏడుగురిని ఆస్పత్రిలో చేర్పించామని, దాంట్లో ఆరుగురు మృతిచెందినట్లు డాక్టర్లు చెప్పినట్లు మీరట్ ఎస్పీ అవినాశ్ పాండే పేర్కొన్నారు.
ఇక్బాల్ అహ్మద్ అనే వ్యక్తి ఇంట్లో అగ్నిప్రమాదం జరిగినట్లు సుమారు రాత్రి 9 గంటలకు సమాచారం వచ్చినట్లు పోలీసులు చెప్పారు. దీంతో ఆ ఇంటి వద్దకు అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటల్ని ఆర్పే ప్రయత్నం చేశారు. ఆ మంటల్ని అదుపులోకి తెచ్చారు. అయితే ఆ ఇంట్లో టెయిలరింగ్ వర్క్ జరుగుతున్నట్లు పోలీసులు వెలల్డించారు. టెయిలరింగ్ కోసం తెచ్చిన దుస్తులు భారీ మొత్తంలో ఇంట్లో ఉన్నాయని, అగ్ని అంటుకోవడంతో తక్కువ సమయంలోనే ఎక్కువ మంటలు వ్యాపించినట్లు పోలీసులు చెప్పారు.
మృతులను రష్కార్, మహబిష్, హమ్మద్, అకాడాస్, నబియా, ఇనాయత్గా గుర్తించారు. 55 ఏళ్ల మహిళ అమీర్ బానో మాత్రం ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడింది.