న్యూఢిల్లీ: మాజీ కేంద్ర మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత ఎంపీ శశి థరూర్ ( Shashi Tharoor ) చేసిన ఓ ట్వీట్ తీవ్ర వివాదం సృష్టిస్తున్నది. తాలిబన్లతో మలయాళీ లింకు ఉన్నట్లు చెబుతూ ఆయన ఓ ట్వీట్ను పోస్టు చేశారు. రమీజ్ అనే వ్యక్తి తన ట్విట్టర్లో పోస్టు చేసిన వీడియోకు శశి థరూర్ ఆ కామెంట్ పెట్టారు. ఆ వీడియోలో కాబూల్ చేరుకున్న తర్వాత తాలిబన్ ఫైటర్లు నేలపై కూలబడి ఆనందభాష్పాలు రాల్చారు. అయితే ఆ వీడియోపై ఎంపీ శశి థరూర్ రియాక్ట్ అవుతూ.. ఆ తాలిబన్లు మలయాళంలో మాట్లాడుకున్నట్లు తన ట్వీట్లో తెలిపారు. వీడియోలోని 8వ సెకను వద్ద మలయాళీ పదాన్ని వాడినట్లు పేర్కొన్నారు. ఎంపీ శశి చేసిన కామెంట్.. తీవ్ర దుమారాన్ని రేపుతున్నది.
ఎంపీ శశి కామెంట్ తర్వాత రమీజ్ తన ట్వీట్లో వివరణ ఇచ్చారు. తాలిబన్ ఫైటర్లకు కేరళతో సంబంధం లేదన్నారు. ఆ వీడియోలో ఉన్నవాళ్లు బలోచిస్తాన్కు చెందిన ద్రావిడ భాష బ్రాహ్విలో మాట్లాడుతున్నట్లు ఆ యూజర్ పేర్కొన్నాడు. ఇది తెలుగు, తమిళం, మలయాళంకు సమీపంగా ఉంటుందన్నాడు. మళ్లీ ఆ ట్వీట్పై రియాక్ట్ అయిన ఎంపీ శశి థరూర్.. తాలిబన్లలో మలయాళీలు ఉన్నారన్న విషయాన్ని కొట్టిపారేయలేమన్నారు. రమీజ్ ఇచ్చిన వివరణ ఇంట్రెస్టింగ్గా ఉన్నా.. భాషా పండితులు ఆ పదాల అర్ధాలను తేల్చుతారని, గతి తప్పిన మలయాళీలు తాలిబన్లలో చేరి ఉంటారన్న అభిప్రాయాన్ని ఎంపీ శశి వ్యక్తం చేశారు.
థరూర్ చేసిన వ్యాఖ్యలను బీజేపీ నేత జేపీ నడ్డా తప్పుపట్టారు. కేరళతో ఉగ్రవాదం లింకు ఉన్నట్లు కాంగ్రెస్ నేత అననడం సిగ్గుచేటు అని నడ్డా ఆరోపించారు. ఎంపీ శశి థరూర్ చేసిన వివాదాస్పద ట్వీట్ను పలువురు నేతలు, అధికారులు ఖండించారు.