జైపూర్: ముసుగులు ధరించిన ఇద్దరు వ్యక్తులు బ్యాంకులోకి చొరబడ్డారు. వెంట తెచ్చిన తుపాకులతో గాల్లోకి కాల్పులు జరిపారు. కస్టమర్లు, బ్యాంకు సిబ్బందిని బెదిరించారు. పది లక్షలకుపైగా డబ్బును దోచుకున్నారు. (Masked Men Loot Bank ) రాజస్థాన్లోని బరన్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు ముఖానికి ముసుగు వేసుకుని బైకులపై వచ్చిన ఇద్దరు వ్యక్తులు బద్గాన్ గ్రామంలోని యూకో బ్యాంకులోకి ప్రవేశించారు. తమ చేతుల్లోని తుపాకులతో గాల్లోకి కాల్పులు జరిపారు. కస్టమర్లను భయభ్రాంతులకు గురి చేశారు. బ్యాంకు సిబ్బందిని బెదిరించి రూ.10.75 లక్షలు దోచుకున్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయారు.
కాగా, ఈ సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఆ బ్యాంకుకు చేరుకున్నారు. నేలపై పడి ఉన్న ఖాళీ తూటాల షెల్స్ను స్వాధీనం చేసుకున్నారు. ఆ బ్యాంకులోని సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలిస్తున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దొంగలను అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు పోలీస్ అధికారి తెలిపారు.