లక్నో: వివాహిత మహిళ ఒక వ్యక్తిని మూడో పెళ్లి చేసుకుంది. రెండో భర్త ద్వారా బెదిరించి డబ్బులు దోచుకుంది. (Married Woman Dupes Man) ఈ మోసం గురించి తెలియడంతో ఆ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఆ మహిళపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఈ సంఘటన జరిగింది. సేనాని విహార్ ప్రాంతానికి చెందిన పర్మానంద్ సింగ్, మ్యాట్రిమోనియల్ వెబ్సైట్లో తన బయో డేటాను అప్లోడ్ చేశాడు. దీంతో ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నట్లు పేర్కొన్న 30 ఏళ్ల మహిళ అతడ్ని సంప్రదించింది. ఈ నేపథ్యంలో 2022 నవంబర్లో వారిద్దరికి పెళ్లి జరిగింది.
కాగా, పెళ్లైన ఏడాది తర్వాత గత నవంబర్లో అనుపమ్ సోనీ అనే వ్యక్తి పర్మానంద్ సింగ్కు ఫోన్ చేశాడు. అతడు వివాహం చేసుకున్న మహిళ తన భార్య అని చెప్పాడు. ఆమెతో పెళ్లిని కొనసాగిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించి డబ్బులు డిమాండ్ చేశాడు. ఈ విషయంపై భార్యను పర్మానంద్ సింగ్ నిలదీశాడు. దీంతో అనుపమ్ సోనీకి ముందు అశుతోష్ పాఠక్తో కూడా ఆమెకు పెళ్లి జరిగినట్లు తెలుసుకుని షాక్ అయ్యాడు.
మరోవైపు ఉద్యోగం గురించి కూడా భార్య అబద్ధం చెప్పినట్లు పర్మానంద్ సింగ్ తెలుసుకున్నాడు. ఆమె తనను మోసం చేసిందని, రెండో భర్త, ఇతరుల ద్వారా రూ.2.67 లక్షల విలువైన డబ్బు, నగలను దోచుకున్నదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన ఆస్తి, స్టేటస్ గురించి తెలిసిన ఆ మహిళ కుటుంబ సభ్యులు వాటిని దక్కించుకునేందుకు పెళ్లి పేరుతో తనను మోసం చేశారని ఆరోపించాడు. ఈ నేపథ్యంలో ఆ మహిళపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.