న్యూఢిల్లీ: వివాహ ప్రతిపాదన నెరవేర్చకపోవడం మోసం కాదని సుప్రీంకోర్టు (Supreme Court) తెలిపింది. ఒక వ్యక్తిపై నమోదైన చీటింగ్ కేసును కొట్టివేసింది. కర్ణాటకకు చెందిన రాజు కృష్ణ షెడ్బాల్కర్, అతడి తల్లి, సోదరి, సోదరులపై ఒక మహిళ చీటింగ్ కేసు పెట్టింది. అతడ్ని తగిన వరుడిగా భావించిన తన తండ్రి పెళ్లి వేదిక బుక్ చేసేందుకు రూ.75,000 ఇచ్చాడని తెలిపింది. అయితే ఆ వ్యక్తి మరో మహిళను పెళ్లాడినట్లు తమకు తెలిసిందని పేర్కొంది. పెళ్లి ప్రతిపాదన పూర్తి చేయని ఆ వ్యక్తి, అతడి కుటుంబం తమను మోసగించినట్లు ఆరోపిస్తూ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించింది. 2021లో విచారణ జరిపిన కోర్టు, రాజు కృష్ణ తప్ప మిగతా కుటుంబ సభ్యులపై చీటింగ్ కేసును కొట్టివేసింది.
కాగా, రాజు కృష్ణ దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. పెళ్లి ప్రతిపాదనతో మహిళను మోసగించినట్లుగా తనపై నమోదైన కేసును కొట్టివేయాలని అభ్యర్థించాడు. న్యాయమూర్తులు సుధాన్షు ధులియా, ప్రసన్న బీ వరాలేతో కూడిన ధర్మాసనం అతడి పిటిషన్పై విచారణ జరిపింది. వివాహ ప్రతిపాదన ఆశించిన ముగింపునకు రాకపోవడానికి అనేక కారణాలు ఉండవచ్చని కోర్టు అభిప్రాయపడింది. అయితే మోసం కింద కేసు చేయాలంటే మోసం చేయడం లేదా మోసం చేయాలనే ఉద్దేశం మొదటి నుంచి ఉన్నదా? అన్నది పరిశీలించాలని న్యాయస్థానం పదే పదే పునరుద్ఘాటించినట్లు గుర్తు చేసింది. ఆధారాలు లేన్నందున రాజు కృష్ణపై నమోదైన చీటింగ్ కేసును సుప్రీంకోర్టు రద్దు చేసింది.